నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి బస్టాండ్ ఆవరణలో దొంగతనాలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, మైనర్ల వాహనాల నడపడం, రోడ్డు ప్రమాదాల నివారణపై సోమవారం పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం. రాజేష్ చంద్ర, ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు బస్టాండ్లో, ముఖ్యంగా బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాలు, గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని, మైనర్లు వాహనాలు నడపవద్దని, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని వివరించారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైన వారు వెంటనే 1930 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని, గుర్తుతెలియని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు చెప్పవద్దని పోలీసులు సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు 1908 టోల్ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 112కు ఫోన్ చేయాలని, మహిళల రక్షణకు షీ టీమ్ అందుబాటులో ఉంటుందని, షీ టీమ్ నంబర్ 8712686094కు సంప్రదించాలని సూచించారు. మానవ అక్రమ రవాణాపై మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం పోలీసు సిబ్బంది రాజేందర్ ప్రయాణికులకు అవగాహన కల్పించారు. పోలీసు కళాబృందం ఇన్చార్జీలు హెడ్ కానిస్టేబుళ్లు రామంచ తిరుపతి, యు. శేషారావు, కానిస్టేబుళ్లు ప్రభాకర్, సాయిలు మాటలు, పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. కామారెడ్డి షీ టీమ్ కానిస్టేబుల్ భూమేష్తో పాటు వివిధ ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులు కార్యక్రమంలో పాల్గొన్నారు.



