సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో
మొత్తం ఐదు గంటల పాటు రైతులు ఆందోళ
తహసిల్దార్ చాంబర్ లో గంటన్నర పాటు ఆందోళన
ముష్టికుంట్ల సొసైటీ కి కొనుగోలు కేంద్రం మంజూరు
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
నవ తెలంగాణ – బోనకల్
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హామీతో రైతులు మండల తహసిల్దార్ ఛాంబర్ నుంచి ఆందోళన విరమించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సాధించుకున్న తర్వాతే ఆందోళన విరమిస్తామని ఆందోళన ప్రారంభించారు. అనుకున్న విధంగానే మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మంజూరు చేయించుకొని రైతులు తమ పంతం నెగ్గిచుకున్న సంఘటన మండల కేంద్రంలో సంచలనంగా మారింది. పోరాడితే తప్ప సమస్య పరిష్కారం కాదని మరొక్కసారి అన్నదాతలు నిరూపించారు. పోరాడి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సాధించుకున్నారు అన్నదాతలు. ముష్టికుంట్ల సొసైటీ పరిధిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని అన్నదాతలు సోమవారం తొలుత రోడ్డెక్కారు. సుమారు రెండు గంటలపాటు అన్నదాతలు బోనకల్ – ఖమ్మం ప్రధాన రహదారిపై ముష్టికుంట్ల వద్ద ఆందోళన నిర్వహించారు. దీంతో ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎస్సై రంగ ప్రవేశం చేశారు. రైతులతో చర్చలు జరిపి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మంజూరు క కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
వివరాలు ఇలా ఉన్నాయి..
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోనే బోనకల్ మండల పరిధిలోని ముష్టికుంట్ల సొసైటీ పరిధిలో ముష్టికుంట్ల, చొప్పకట్లపాలెం, రామాపురం గ్రామాలు ఉన్నాయి. ఈ సొసైటీ పరిధిలో మొత్తం 4,249 ఎకరాలలో అన్నదాతలు మొక్కజొన్న పంట సాగు చేశారు. సుమారు పది రోజుల నుంచి ముష్టికుంట్లలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని కాంగ్రెస్ నాయకులు తమకు హామీ ఇచ్చుకుంటూ వచ్చారని ముష్టికుంట్ల రైతులు తెలిపారు. ప్రతిరోజు ఈ రోజు రేపు అంటూ కాంగ్రెస్ నాయకులు తమను మోసగించుకుంటూ వస్తున్నారని ముష్టికుంట్ల రైతులు తెలిపారు. ఎన్ని రోజులైనా ముష్టికుంట్ల సొసైటీ పరిధిలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతల ఆగ్రహంతో సోమవారం బోనకల్ – ఖమ్మం ప్రధాన రహదారిపై ముష్టికుంట్ల రోడ్డుపై సుమా 200 మంది రైతులు ఆందోళనకు దిగారు. దాదాపు రెండు గంటలపాటు మొక్కజొన్న కంకులతో ఆందోళన నిర్వహించారు.
ఈ ఆందోళన ఫలితంగా రోడ్డుకిరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్సై పొదిలి వెంకన్న హుటా హుటీనా సంఘటన స్థలానికి చేరుకున్నారు. తొలుత రైతులతో శాంతియుతంగా చర్చలు జరిపి ఆందోళన విరమింప చేసేందుకు అనేకసార్లు ప్రయత్నాలు చేశారు. అయినా రైతులు ఆగ్రహంతో ఊగిపోయారు. సిపిఎం మండల కార్యదర్శి కిలారు సురేష్, బి ఆర్ ఎస్ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు రైతు బంధం నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి బంధం శ్రీనివాసరావు లను ఎస్ఐ పొదిలి వెంకన్న, సిబ్బంది అరెస్టు చేసేందుకు పలుసార్లు ప్రయత్నించగా రైతులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఓ అర్ధగంట పాటు పోలీసులు రైతులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించడం, ఆ ప్రయత్నాలను రైతుల అడ్డుకోవడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీనికి తోడు భారీగా వాహనాలు నిలిచిపోవడం, ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సుమారు రెండు గంటల అనంతరం ఎస్సై పొదిలి వెంకన్న మండల తహసిల్దార్ మద్దెల రమదేవి తో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తాను సమస్యను తీసుకెళ్లానని సమస్య పరిష్కరించేందుకు వారు కృషి చేస్తానని హామీ ఇచ్చారని ఎస్ఐ తెలపడంతో రైతులు ఆందోళన విరమించారు.
ఆ తర్వాత తమ ఆందోళనను మండల కేంద్రంలో గల రైతు వేదికకు మార్చారు. అక్కడ గంటన్నర పాటు ఆందోళన నిర్వహించారు. ఆందోళన వద్దకు మండల తహసిల్దార్ మద్దెల రమాదేవి వెళ్లారు. కానీ రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. దీంతో రైతులు తమ ఆందోళనను తహసిల్దార్ చాంబర్ కు మార్చారు. ఛాంబర్ లోనే రైతులు గంటపాటు ఆందోళన నిర్వహించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మంజూరు తోటే తాము బయటికి వెళ్తామని అప్పటిదాకా వెళ్లేది లేదని సిపిఎం మండల కార్యదర్శి కిలారి సురేష్ టిఆర్ఎస్ మండల కార్మిక సంఘం అధ్యక్షుడు బంధం నాగేశ్వరరావు వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి బంధం శ్రీనివాసరావు సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు స్పష్టం చేశారు. దీంతో తహసిల్దార్ పదేపదే కలెక్టర్ కు ఫోన్ చేశారు. చివరకు ఓ గంట తర్వాత కలెక్టర్ స్పందించి తహసిల్దార్ కి, మండల వ్యవసాయ శాఖ అధికారి పసునూరి వినయ్ కుమార్ కు ఫోన్ చేశారు. లౌడ్ స్పీకర్ పెట్టి రైతులకు కలెక్టర్ మాట్లాడుతున్న విషయాలను వారు వివరించారు. ప్రస్తుతం ముష్టికుంట్ల సొసైటీ కి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. దీంతో రైతులు ఆనందంతో కలెక్టర్, తహసిల్దార్, మండల వ్యవసాయ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
వెంటనే తమ ఆందోళన విరమించారు. తాము పోరాడి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సాధించుకున్నామని ముష్టికుంట రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటూ కేరింతలు కొట్టుకుంటూ ముష్టికుంట్ల వెళ్లారు.ఈ సందర్భంగా కిలారు సురేష్, బంధం నాగేశ్వరరావు బంధం శ్రీనివాసరావు మాట్లాడుతూ ముష్టికుంట్ల సొసైటీ పరిధిలో పది రోజుల నుంచి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని అధికార పార్టీ నాయకులు రైతులను మభ్యపెట్టుకుంటూ వచ్చారని విమర్శించారు. మరో మార్గం లేకనే ముష్టికుంట సొసైటీ పరిధిలో రైతులు రోడ్డెక్కారన్నారు. వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని, మొక్కజొన్న కొనుగోలుపై 26 గంటల పరిమితిని ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ గుగులోతు నరేష్, బిజెపి నాయకులు వీరపనేని అప్పారావు, తాళ్లూరి సురేష్, గుగులోతు నాగేశ్వరరావు, రైతులు దొండపాటి సత్యనారాయణ, ఎర్రగాని నాగరాజు, షేక్ ఇబ్రహీం, బొడ్డుపల్లి నరసింహారావు, షేక్ పెంటు సాహెబ్, పండుగ గోపాలరావు, దొప్ప ప్రసాద్, దొప్ప కృష్ణ, బాలు శ్రీనివాసరావు, ఆవుల వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకులు తమను మాయమాటలతో మోసం చేశారు
ముష్టికుంట కాంగ్రెస్ నాయకులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని తీసుకు వస్తున్నామంటూ పది రోజులగా తమను మోసం చేస్తున్నారని ముష్టికుంట్ల అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రోడ్డు ఎక్కితే అటువైపు కనీసం కన్నెత్తి ఒక్క కాంగ్రెస్ నాయకుడు చూడలేదని తెలిపారు. తాము రాజకీయాలకు అతీతంగా రైతులందరం కలిసికట్టుగా ఐదు గంటల పాటు పోరాడి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. ఐదు గంటల పాటు తమ ఆందోళన చేస్తే కన్నీటి చూడని కాంగ్రెస్ నాయకులు, తాము పోరాటం చేసి సాధించుకున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రంపై కాంగ్రెస్ నాయకులు ఆడుతున్న దొంగనాటకాలు ఇప్పటికైనా మానుకొని వాస్తవాలు మాట్లాడాలని రైతులు హితావు పలికారు.



