ఆందోళన చేపట్టిన నిరసనకారులు
బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శ
లక్నో: ఉత్తరప్రదేశ్లో మరో అంబేద్కర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. యూపీలోని ఘజియాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గానికి చెందిన సభ్యులు నిరసన చేపట్టారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించుకున్నారు. ఈ సందర్భంగా ఘజియాబాద్ (గ్రామీణ) డీసీపీ సురేంద్ర నాథ్ తివారీ మాట్లాడుతూ ” డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైనట్టు సమాచారం అందింది. కేసు నమోదు చేసి దుండగులను అరెస్టు చేయడానికి ఓ బృందాన్ని ఏర్పాటు చేశాం. విచారణ నిమిత్తం పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నాం” అని అన్నారు. ఈ ఘటనపై బీజేపీ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ”అధికార పార్టీ ఆధిపత్య వర్గాలకు చెందిన వారికి మద్దతు ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. డాక్టర్ అంబేద్కర్ విగ్రహంపై దాడి దళితుల ఆత్మగౌరవ ఉద్యమంపై దాడి” అని కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి షానవాజ్ ఆలం అన్నారు. సమాజ్వాదీ పార్టీ కూడా రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ ఘటనను ”తీవ్రంగా కలవరపరిచేది”గా అభివర్ణించింది. ”ఇది చాలా బాధాకరమైన సంఘటన. డాక్టర్ అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదు. ఆయన రాజ్యాంగ నిర్మాత , సమానత్వం, గౌరవం, సామాజిక న్యాయం పట్ల భారతదేశ సమిష్టి నిబద్ధతకు ప్రతీక” అని సమాజ్వాదీ పార్టీ అధికార ప్రతినిధి నాసర్ సలీం అన్నారు.
ఉత్తరప్రదేశ్లో మరో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం
- Advertisement -
- Advertisement -



