Monday, June 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి..

క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి..

- Advertisement -

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో క్యూబా సంఘీభావ నిధి..
క్యూబాకు అండగా నిలిచి ఆర్థిక సహకారం అందిద్దాం – సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీ. భాస్కర్
నవతెలంగాణ – దుబ్బాక
: సోషలిస్ట్ విప్లవం తర్వాత అంచలంచెలుగా ఎదుగుతున్న క్యూబాపై.. గత 65 ఏళ్లుగా ఆ దేశ ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీసేలా.. పలు దేశాలతో వాణిజ్య, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలను నిషేధిస్తూ అమెరికా ఆంక్షలు విధించడం అనైతిక చర్య అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీ.భాస్కర్ అన్నారు. అమెరికా అవలంబిస్తున్న దుర్మార్గపు ఆంక్షలతో క్యూబా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్యూబా పై విధించిన ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం దుబ్బాక పట్టణ కేంద్రంలో సీపీఐ(ఎం) పట్టణ శాఖ నిర్వహించిన సమావేశంలో క్యూబా దేశానికి సంఘీభావంగా విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోటి 11 లక్షల మంది జనాభా గల చిన్న దేశమైన క్యూబాపై.. ఇతర దేశాలు ఎలాంటి సహాయ సహకారాలు అందించకుండా అగ్రరాజ్యమైన అమెరికా విధించిన ఆర్థిక, వాణిజ్య ఆంక్షల వల్ల ఆ దేశం గత 65 ఏళ్లుగా నలిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో క్యూబా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని ఆహారం, ఔషధాలు, ఇంధనం వంటి అత్యవసర వస్తువుల కొరత ఏర్పడి అక్కడి ప్రజల జీవనం దుర్భరమైందన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రతి ఏటా ఈ ఆంక్షలు రద్దు చేయాలని తీర్మానాలు చేసి ఆమోదించినప్పటికీ.. అగ్రరాజ్యమైన అమెరికా వాటిని లెక్కచేయకుండా  అలాగే కొనసాగించడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ఈ ఆంక్షల వల్ల క్యూబా ప్రజల ఆరోగ్య, సంరక్షణ, విద్య, ఆహార, భద్రత వంటి ముఖ్యమైన రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఆంక్షలు విధించడమంటే అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాల్ని ఉల్లంఘించచడమేనని స్పష్టం చేశారు. క్యూబా ప్రజల విప్లవస్ఫూర్తి ,సామాజిక సమానత్వం, వారి పోరాటాన్ని చూసి ప్రపంచ వ్యాప్తంగా క్యూబాకు సంఘీభావంగా ఆర్థిక సహాయం అందించడం మొదలైందన్నారు. మానవతా దృక్పథంతో ప్రపంచం ఈ ఆంక్షలు ఎదిరిస్తూ క్యూబా ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) దుబ్బాక పట్టణ కార్యదర్శి కొంపల్లి భాస్కర్, సభ్యులు బత్తుల రాజు, బండారి మహేష్, లక్ష్మీ నర్సయ్య, ఎండీ సాజిద్, మల్లేశం, లక్ష్మీనారాయణ, రాజు, శ్రీనివాస్, ఎల్లప్ప పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -