Tuesday, June 10, 2025
E-PAPER
Homeజాతీయంనిజమా...జపాన్‌ను అధిగమిస్తామా!

నిజమా…జపాన్‌ను అధిగమిస్తామా!

- Advertisement -

అవునంటున్న ఐఎంఎఫ్‌, నిటి ఆయోగ్‌
కాదంటున్న నిపుణులు, ప్రపంచబ్యాంక్‌
వాస్తవాలు బట్టబయలు చేసిన గణాంకాలు

ఈ ఏడాదిలోనే జపాన్‌ను భారత్‌ అధిగమించి ప్రపంచంలో నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఇటీవల ప్రకటిం చింది. ఇంకేముంది? ప్రధాన స్రవంతి మీడియా పతాక శీర్షికలలో ఆ వార్తను, అనుబంధ కథనాలను ప్రచురిం చింది. అయితే భారత్‌ ఇప్పటికే జపాన్‌ను దాటేసిందంటూ నిటి ఆయోగ్‌ సీఈఓ బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం గత వారం ఓ ప్రకటన చేశారు. దీంతో మీడియా మరింత సంబరపడిపోయింది. అయితే ఈ వాదనతో అనేక మంది నిపుణులు విభేదించారు. వారిలో నిటి ఆయోగ్‌ సభ్యుడు అరవింద్‌ విర్మానీ కూడా ఉన్నారు. ప్రపంచబ్యాంక్‌ డేటా కూడా నిపుణుల వాదనకు బలం చేకూరుస్తోంది.
న్యూఢిల్లీ : ఐఎంఎఫ్‌ అంచనాలను అనేక సంస్థలు స్వాగతిం చాయి. ప్రధాని నరేంద్ర మోడీ యొక్క 2047 దార్శనికతలో ఇది ఓ భాగమంటూ ఆకాశానికి ఎత్తేశాయి. సందేహాలు వ్యక్తం చేస్తున్న వారిని ‘అనుమానాల పుట్టలు’గా అభివర్ణిస్తున్న వారూ ఉన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత కాల్పుల విరమణను ప్రశ్నించిన వారితో వీరిని పోల్చారు. ‘మోడీనామిక్స్‌ భారత్‌ను ముందుకు నడుపుతోంది’ అని కొన్ని పత్రికలు పతాక శీర్షికలలో కథనాలను వండి వార్చాయి. ప్రధాని అవలంబిస్తున్న ఆర్థిక విధానాల కారణంగానే ఈ వృద్ధి సాధ్యపడిందని ప్రశంసించాయి. ఇది అద్భుత విజయం అని టీవీ ఛానల్స్‌ యాంకర్లు కేరింతలు కొట్టగా ‘భారత్‌ సూపర్‌ పవర్‌’ అంటూ స్క్రోల్స్‌ వచ్చాయి. కొందరు అత్యుత్సాహవంతులైన వ్యాఖ్యాతలైతే జపాన్‌ను భారత్‌ ఓడించిందంటూ చెప్పుకొచ్చారు.
ఏ రంగంలో పోల్చినా…
అయితే అతి తక్కువ మంది విశ్లేషకులు మాత్రమే వాస్తవాలను వివరించగలిగారు. తలసరి ఆదాయం, మానవాభివృద్ధి సూచికలను పరిగణనలోకి తీసుకొని ఐఎంఎఫ్‌ నివేదిక సగటు భారతీయుడికి ఏమి చెప్పిందో తెలియజేశారు. ఉదాహరణకు మన తలసరి జీడీపీ ఇప్పటికీ 2,500 డాలర్ల కంటే తక్కువగానే ఉంది. ప్రపంచంలో అగ్ర స్థానాలలో ఉన్న ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే మన తలసరి జీడీపియే అత్యల్పం. మొదటి ఐదు అగ్ర ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే మన దేశంలో శిశు మరణాల రేటు అత్యధికంగా 24.5గా నమో దైంది. ఈ రేటు వియత్నాంలో 14, చైనాలో 5, అమెరికాలో 6, జర్మనీలో 3, జపాన్‌లో 2 మాత్రమే. మన జనాభాలో 93.3 శాతం మందికి పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉంది. ఈ డేటాను చూసి సంబరపడకండి.
ఎందుకంటే అగ్ర స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలలో ఇంత కంటే ఎక్కువ మందికే స్వచ్ఛమైన నీరు లభిస్తోంది. అమెరికాలో 99.9 శాతం మందికి, చైనాలో 97.6 శాతం మందికి, జర్మనీలో వంద శాతం మందికి, జపాన్‌లో 99.14 శాతం మందికి, వియత్నాంలో 97.96 శాతం మందికి పరిశుభ్రమైన నీరు అందుతోంది. ఇక 78 శాతం మంది భారతీయులకు మాత్రమే సురక్షితమైన పారిశుధ్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అమెరికాలో వంద శాతం మందికి, చైనాలో 96 శాతం మందికి, జర్మనీలో 99 శాతం మందికి, జపాన్‌లో 92 శాతం మందికి, వియత్నాంలో 92 శాతం మందికి ఈ సౌకర్యాలు చేరువలో ఉన్నాయి. సంతోషానికి సంబంధించిన సూచికలో భారత్‌ స్థానం 118. ఈ సూచీలో ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే భారత్‌ చాలా వెనుకబడి ఉంది. జర్మనీ 22, అమెరికా 24, వియత్నాం 46, జపాన్‌ 55, చైనా 68, కామెరూన్‌ 104, సూడాన్‌ 137 స్థానాలలో ఉన్నాయి.
జీడీపీ తలసరి-కొనుగోలు శక్తిలో…
2010లో మన జీడీపీ తలసరి ఎంత ఉందో వియత్నాం, కామెరూన్‌, సూడాన్‌ దేశాలదీ దాదాపుగా అంతే ఉంది. ఒక దేశపు మొత్తం జీడీపీని దాని జనాభాతో భాగించి జీడీపీ తలసరిని లెక్కిస్తారు. ప్రపంచబ్యాంక్‌ డేటా ప్రకారం…2023లో భారత్‌ జీడీపీ తలసరి 2,480 డాలర్లు కాగా చైనాలో 12,614 డాలర్లు, జపాన్‌లో 33,776 డాలర్లు, జర్మనీలో 55,343 డాలర్లు, అమెరికాలో 82,253 డాలర్లు ఉంది. ఇక వియత్నాంలో 4,282 డాలర్లు, సూడాన్‌లో 2,183 డాలర్లు, కామెరూన్‌లో 1,736 డాలర్లుగా నమోదైంది. అగ్ర రాజ్యాలతో పోలికను పక్కన పెడితే సూడాన్‌, కామెరూన్‌, వియత్నాం వంటి దేశాలతో పోటీ పడాల్సిన దుస్థితి నెలకొంది. ఇక కొనుగోలు శకక్తిని పరిశీలిద్దాం. మన దేశంలో కొనుగోలు శక్తి 10,166 డాలర్లు ఉండగా చైనాలో 25,569 డాలర్లు, జపాన్‌లో 49,793 డాలర్లు, జర్మనీలో 69,205 డాలర్లు, అమెరికాలో 82,769 డాలర్లు ఉంది. వియత్నాంలో కూడా కొనుగోలు శక్తి మన కంటే ఎక్కువగానే (14,973 డాలర్లు) ఉండగా సూడాన్‌ (2,740 డాలర్లు), కామెరూన్‌ (153 డాలర్లు)లో మాత్రం తక్కువగా ఉంది. నామమాత్రపు జీడీపీలో సైతం జపాన్‌, జర్మనీ, చైనా, అమెరికా కంటే మనం బాగా వెనుకబడి ఉన్నాము. ఇలాంటి పరిస్థితులలో ప్రపంచంలో భారత్‌ నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందంటే నమ్మడం ఎలా?
మానవాభివృద్ధిలో…
మానవాభివృద్ధి సూచీలోనూ భారత్‌ పరిస్థితి పేలవంగానే ఉంది. ప్రపంచబ్యాంక్‌ డేటా ప్రకారం 2023లో భారత్‌ మానవాభివృద్ధి సూచీ 0.69 కాగా వియత్నాం సూచీ 0.77, చైనా సూచీ 0.80, జపాన్‌ సూచీ 0.93, అమెరికా సూచీ 0.94, జర్మనీ సూచీ 0.96గా ఉంది. మన దేశంలో సగటు జీవితకాలం 72 సంవత్సరాలు కాగా వియత్నాంలో 74.6, చైనాలో 78, అమెరికాలో 79.3, జర్మనీలో 81.4, జపాన్‌లో 84.7 సంవత్సరాలుగా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -