నవతెలంగాణ – హైదరాబాద్: రైలు ప్రయాణికులు ఇకపై తమకు కావాల్సిన ఆహారాన్ని నచ్చిన రెస్టారంట్ నుంచి తెప్పించుకోవచ్చు. ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ ఆ ఫుడ్ను మీకు అందివ్వనుంది. ఈ మేరకు ఐఆర్సీటీసీ, స్విగ్గీ మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం కుదిరింది. మార్చి 12 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలుత విశాఖపట్నం, విజయవాడ, భువనేశ్వర్, బెంగళూరు స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. స్విగ్గీలో ఆహారాన్ని ఆర్డర్ చేసుకునేందుకు ఐఆర్సీటీసీ యాప్ను వినియోగించాల్సి ఉంటుంది. అందులో పీఎన్ఆర్ నంబర్ను ఎంటర్ చేసి కావాల్సిన ఆహారాన్ని కావాల్సిన స్టేషన్లో డెలివరీ పొందొచ్చు. ఈ భాగస్వామ్యం వల్ల ప్రయాణికులు మరింత మధురానుభూతి పొందుతారని ఐఆర్సీటీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ ఈ సందర్భంగా తెలిపారు.