Tuesday, June 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలుచదువుకొను

చదువుకొను

- Advertisement -

తల్లిదండ్రులపై మోయలేని ఫీజుల భారం
ఇదీ ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూళ్ల తీరు
ఆదాయంలో 40 శాతం వరకు ఖర్చు
ఏటా 10 నుంచి 15 శాతం పెంపు
పుస్తకాలు, యూనిఫామ్‌, రవాణా చార్జీలు అదనం
సేవను మరిచి యథేచ్ఛగా విద్యావ్యాపారం
ఫీజుల నియంత్రణపై చేతులెత్తేసిన సర్కారు
చట్టం చేయాలంటూ విద్యాకమిషన్‌ సిఫారసు
ఎలాంటి నిర్ణయం తీసుకోని ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అధిక ఫీజులను వసూలు చేస్తూ నిలువునా దోపిడీ చేస్తున్నాయి. సీబీఎస్‌ ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ, కేంబ్రిడ్జీ, ఇంటర్నేషనల్‌ వంటి పేర్లతో లక్షల రూపాయల ఫీజులను దండుకుంటున్నాయి. ఏసీ తరగతి గదులు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, డిజిటల్‌ చదువులంటూ తల్లిదండ్రులను పీల్చి పిప్పిచేస్తున్నాయి. ఎల్‌కేజీ చదువుకే ఏకంగా రూ.నాలుగు లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. పదో తరగతి వరకు ఆ ఫీజు ఎంత వరకు పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ-టెక్నో, టెక్నో కరికులమ్‌, ఒలంపియాడ్‌, కాన్సెప్ట్‌ వంటి రకరకాల పేర్లతో అందిన కాడికి దోచుకుంటున్నాయి. చదువుకునే పరిస్థితి నుంచి చదువు’కొనే’ దుస్థితి వచ్చింది. ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూళ్లలో చదువుకొంటే నే అడ్మిషన్‌ అనే పరిస్థితి దాపురించింది. విద్య అంటే సేవ. స్వాతంత్య్రం వచ్చాక, నూతన ఆర్థిక విధానాలు అమల్లోకి రాకముందు వ్యాపార దృష్టితో కాకుండా సేవా దృక్పథంతోనే చాలా మంది విద్యాసంస్థలను స్థాపించారు. అందులో భాగంగానే ఎయిడెడ్‌ విద్యాసంస్థలు వచ్చాయి. సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాక ప్రతిదీ ఇప్పుడు సరుకుగా మారింది. అందులో భాగంగా చదువు కూడా వ్యాపారంగా మారింది. ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు సేవను పూర్తిగా మరిచి విద్యావ్యాపారం చేస్తున్నాయి.
ఫీజుల నియంత్రణ చట్టం ఎప్పుడు?
రాష్ట్రంలో కార్పొరేట్‌ విద్యావ్యాపారాన్ని నియంత్రిస్తామని మాజీ సీఎం కేసీఆర్‌ ఉద్యమ సమయంలో చెప్పినా అధికారంలోకి వచ్చాక అందుకోసం చర్యలు చేపట్టలేదన్న విమర్శలు పెద్దఎత్తున వచ్చాయి. రాష్ట్రంలో అధిక ఫీజులను తగ్గించాలంటూ రాష్ట్రంలో పెద్దఎత్తు న విద్యార్థుల తల్లిదండ్రులూ ఉద్యమించారు. స్పందించిన నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తిరుపతిరావు నేతృత్వంలో కమిటీని వేసింది. ఆ కమిటీ నివేదిక ఇచ్చినా, సిఫారసులను గత ప్రభుత్వం అమలు చేయలేదు. ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రిం చేందుకు ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్నది. అందుకే రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి నేతృత్వంలో విద్యాకమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిం ది. రాష్ట్రంలో ఫీజుల కట్టడికి చట్టం చేయాలని ఆ కమిషన్‌ సిఫారసు చేసింది. ఇంకోవైపు గ్రామీణ, పట్టణ ప్రాంతాలను వేర్వేరుగా పరిగణనలోకి తీసుకుని ప్రయివేటు పాఠశాలలను శ్లాబులుగా విభజించి ఫీజులను ఖరారు చేయాలని సూచించింది. ఫీజుల నియంత్రణ కోసం చట్టం చేస్తామంటూ మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు శ్రీధర్‌బాబు ప్రకటించారు. ఈనెల 12న 2025-26 విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్నది. ఇప్పటి వరకు ఫీజుల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఫీజుల నియంత్రణ చట్టం ఎప్పుడు అమల్లోకి తెస్తారంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి : టి నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి
రాష్ట్రంలో ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలలు యథేచ్ఛగా అధిక ఫీజులను వసూలు చేస్తున్నాయి. ఏటా ఫీజులను పెంచుతూ తల్లిదండ్రులపై భారాలు మోపుతున్నాయి. ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ లేదు. కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో ఫీజులను నియంత్రించడానికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలి. ఇంటర్నేషనల్‌, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ వంటి సిలబస్‌ పేరుతో ఫీజులను దండుకోవడంపై చర్యలు తీసుకోవాలి. విద్యాకమిషన్‌ సిఫారసులపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలి.
జూన్‌ వచ్చిందంటే బెంబేలు
పాఠశాల స్థాయిలోనే ఐఐటీ, నీట్‌ ఫౌండేషన్‌ చదువులంటూ తల్లిదండ్రులు, విద్యార్థులను కార్పొరేట్‌ విద్యాసంస్థలు మోసం చేస్తున్నాయి. నర్సరీ (కిండర్‌గార్టెన్‌), ఎల్‌కేజీ (పీపీ-1), యూకేజీ (పీపీ-2) చదువులకే రూ.లక్షల ఫీజులను వసూలు చేస్తుండడంతో తల్లిదండ్రులపై మోయలేని భారం పడుతున్నది. ఇక కార్పొరేట్‌, ఇంటర్నేషనల్‌ స్కూళ్లు డొనేషన్ల పేరుతో రూ.లక్షలు వసూలు చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఏటా 10 నుంచి 15 శాతం వరకు ఫీజులను యాజమాన్యాలు పెంచుతున్నాయి. ఫీజుల పెంపునకు ఎలాంటి ప్రాతిపదిక లేదు. వస్తున్న ఆదాయం, ఖర్చు వంటి వాటిపై ఆడిట్‌ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించి ఎంత పెంచాలో అనుమతి తీసుకోవడం లేదు. ఇష్టమొచ్చినట్టు ఫీజులను పెంచుతున్నాయి. పాఠశాలలు ప్రారంభమయ్యే జూన్‌ నెల వచ్చిందంటేనే తల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు. ఫీజులతోపాటు పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫారాల పేరుతో అదనంగా వసూలు చేస్తున్నాయి. అది కాకుండా రవాణా చార్జీల పేరుతో కిలోమీటర్‌కు ఇంత చార్జీ చొప్పున బాదుతున్నాయి. ఇలా చదువు పేరుతో ఫీజులను, దానికి అదనంగా ఇతర పేర్లతోనూ అడ్డూఅదుపు లేకుండా వసూలు చేస్తున్నాయి. తల్లిదండ్రులు వారి ఆదాయంలో 40 శాతం వరకు పిల్లల చదువులకే ఖర్చు చేస్తున్నారని విద్యావేత్తలు చెప్తున్నారు. కొందరు తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం అప్పులపాలవుతున్నారు. అధిక వడ్డీలకు తెచ్చి ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో వసతులుండవు, తరగతి గదికి ఒక టీచర్‌ ఉండరు అన్న అభిప్రాయంతో పిల్లలను ప్రయివేటు పాఠశాలల్లో తల్లిదండ్రులు చేర్పిస్తున్నారు. రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరంలో 11,757 ప్రయివేటు పాఠశాలల్లో 37,26,220 (61.11 శాతం) మంది విద్యనభ్యసించారు. ఈ గణాంకాలే అందుకు నిదర్శనం. దీన్ని ఆసరాగా చేసుకుని నాణ్యమైన విద్యను అందించకుండా కేవలం ఫీజులపైనే అవి దృష్టిసారిస్తున్నాయి. ప్రయివేటు బడుల్లో చదివే పిల్లలకు కూడా కనీస పరిజ్ఞానం ఉండడం లేదంటూ అసర్‌ వంటి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -