– రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్
– ఇబ్రహీంపట్నంలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్
– కేంద్రంతో కలిసి వ్యవసాయాభివృద్ధి : మంత్రి తుమ్మల
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
పామాయిల్ సాగు చేసే రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహన్ తెలిపారు. ‘వికసిత్ కృషి సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన సోమవారం పర్యటించారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని కళ్లెం జంగారెడ్డి గార్డెన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడారు.. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాధారణ పంటలతో కాకుండా ఆదాయాన్ని ఇచ్చే పంటలపై కేంద్రీకరించాలని సూచించారు. దేశవ్యాప్తంగా పామాయిల్ సాగు పెరుగుతోందని చెప్పారు. మూడు ఎకరాల్లో సాగు చేసే సంవత్సరానికి రూ.3 లక్షలకు పైగా ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. వరి, మక్కా ఉత్పత్తుల్లో రికార్డు స్థాయిలో భారతదేశం నిలుస్తోందని వివరించారు.
టమాట పండించే రైతులకు మార్కెటింగ్ వసతి, రవాణా చార్జీలు కూడా భరిస్తున్నట్టు చెప్పారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. వరి ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ భారతదేశానికే మార్గదర్శకంగా నిలిచిందన్నారు. తెలంగాణలోనూ పామాయిల్ సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ రంగంలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు 35 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో జమ చేశామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో కలిసి వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్చౌదరి, రైతు సంక్షేమ కమిషన్ చైర్మెన్ ఎం. కోదండరెడ్డి, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాట్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఏకే నాయక్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డీకేయాదవ్ పాల్గొన్నారు.
పామాయిల్ రైతాంగానికి కేంద్రం భరోసా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES