Tuesday, June 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయందళిత యువకుడికి న్యాయం చేయాలి

దళిత యువకుడికి న్యాయం చేయాలి

- Advertisement -

– పెత్తందారులకు కొమ్ముకాస్తున్న అధికారులు
– తాండూరు డీఎస్పీని సస్పెండ్‌ చేయాలి
– డీఎస్పీ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-తాండూరు

తాండూరు పోలీసు అధికారులు పెత్తందారులకు కొమ్ముకాస్తున్నారని దళిత, ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. దళిత యువకుడిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తన్న తాండూర్‌ డీఎస్పీని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బెల్కటూర్‌ దళితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ.. వికారాబాద్‌ జిల్లా తాండూర్‌ డీఎస్పీ కార్యాలయాన్ని దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ముట్టడించారు. ముందుగా స్థానిక బస్టాండ్‌ నుంచి డీఎస్పీ కార్యాల యం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కే.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. తాండూర్‌ మండలం బెల్కటూర్‌ గ్రామంలో మే నెల 18న దళిత యువకుడు వినరుకుమార్‌ పెండ్లి బరాత్‌ను అగ్రకులస్తులు అడ్డుకున్నారని తెలిపారు. అంతటితో ఆగకుండా వారిపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. కులం పేరుతో దూషిస్తూ.. తమ వాడలో బరాత్‌ తీస్తారా అంటూ బెదిరించినట్టు తెలిపారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ సొంత గ్రామంలో ఇలాంటి ఘటన జరగడం విచారకరం అన్నారు. బాధితులకు న్యాయం చేయాలని, నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేసినా డీఎస్పీ పట్టించుకోవడం లేదన్నారు. ఈ ఘటనపై కలెక్టర్‌, ఎస్పీ స్పందించి, బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్య క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తూరు చంద్రయ్య, కేవీపీఎస్‌ జిల్లా నాయకులు సురేష్‌, సీఐటీయూ మండల నాయకులు సురేష్‌, ఇతర ప్రజాసంఘాల నాయకులు నవీన్‌, నగేష్‌, ఆనంద్‌, అశోక్‌, ప్రవీణ్‌, ఎం.నవీన్‌కుమార్‌, మధు, బిచ్చప్ప, మహేష్‌, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -