నవతెలంగాణ – హైదరాబాద్: రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి ఉగ్రవాదుల నరమేధానికి పాల్పడ్డారు. క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్లోకి ఆయుధాలతో ప్రవేశించిన ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 60 మందికి పైగా చనిపోగా, మరో 140 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్) వేదికగా స్పందించారు. ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు సంఘీభావం తెలియజేశారు. “మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మా ఆలోచనలు, ప్రార్థనలు వారితోనే ఉంటాయి. ఈ విపత్కర సమయంలో రష్యా ప్రభుత్వానికి, రష్యన్ ఫెడరేషన్ ప్రజలకు అండగా ఉంటాం. ” అని మోడీ ట్వీట్ చేశారు.