మానవ ఆరోగ్యాన్ని పెంపొందించే ప్రాచీన భారతీయ సాధన… యోగ. శరీరంపై పట్టు సాధించడం కోసం యోగ అనే ప్రక్రియను ప్రాచీన కాలంలో తాంత్రికులు ప్రారంభించారు. ఈ యోగాసనాలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడమే గాక, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, జీవనశైలి సంబంధిత వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. ప్రాచీన గ్రంథాలు, పతంజలి ‘యోగ సూత్రాలు’ మొదలైన పుస్తకాలు కూడా శరీరాన్ని ఆరోగ్యంగా వుంచే ప్రక్రియగా దీన్ని వివరిస్తాయి. ‘దాచిపెట్టిన జ్ఞానం నిరుపయోగం కావడమేగాక ప్రజలను పీడించడానికి సాధనమౌతుంది’ అంటారు కొడవటిగంటి. ఆ కాలంలో అనేక వ్యాధులను నయం చేయడానికి యోగ ఉపయోగపడుతుందనే దురభిప్రాయం వుండేది. అది కాస్తా… ఇప్పుడు, జబ్బులు నయం చేయడానికి యోగాను మించింది లేదన్న ప్రచారంగా మారింది. కొన్ని రకాల జబ్బులకు వాకింగ్ వంటి వ్యాయామాన్ని డాక్టర్లు సూచిస్తున్నట్లుగానే, యోగాని కూడా చూడాలి. శరీరంలోని కండరాల నొప్పులను నయం చేయగలదేమో కాని, యోగ వల్ల గుండె జబ్బుల వంటి వ్యాధులు కూడా నయమౌతాయన్న ప్రచారం నిజం కాదు. దానికి సంబంధిత వైద్యులను సంప్రదించాల్సిందే. శాస్త్రీయంగా రుజువుకాని, ఎట్టి పరిశోధనలూ జరగని, పాతకాలపు నాటు వైద్యాలు, నమ్మకాలు… ప్రకృతి వైద్యం, ప్రాణిక్ హీలింగ్, యోగా, ధ్యానం వంటి పేర్లతో ఇటీవల అనేకం ప్రచారంలోకి వస్తున్నాయి.
క్రీ.పూ. మొదటి శతాబ్దం- నాల్గవ శతాబ్దం మధ్య సంకలనం చేయ బడిన ‘పతంజలి యోగ సూత్రాలు’… యోగ తత్వ శాస్త్రానికి సంబంధిం చిన మొదటి గ్రంథంగా చెబుతారు. నాటి పతంజలి సూత్రాలను ఇప్పుడు పట్టుకొచ్చి నేటి పతంజలి పెద్ద వ్యాపారం నడుపుతున్నాడు. రామ్దేవ్ బాబా ‘యోగా’ సామ్రాజ్యం విలువ దాదాపు రూ.4వేల కోట్ల పైమాటే. ఈ యోగా వ్యాపారానికి మీడియా పెద్దఎత్తున ప్రచారం ఇస్తోంది. ఇది విచ్చలవిడిగా వెలుస్తున్న యోగా కేంద్రాల వ్యాపారానికి దోహదపడు తోంది. ప్రాచీన కాలం నుంచి మన దేశానికున్న ప్రత్యేకతల్లోకి నేడు మతాన్ని చొప్పించే ప్రయత్నం ప్రతి సందర్భంలోనూ జరుగుతుండటం బహిరంగ రహస్యం. ఇంకోవైపు దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న సమస్యల నుంచి జనం దృష్టి మళ్లించడానికీ, పైసా ఖర్చు లేకుండా పెద్దఎత్తున రాజకీయ ప్రచారానికీ యోగాకు భారీ ప్రచారం కల్పిస్తున్నారు. ప్రతి యేడాది మల్లే ఈ ఏడాది కూడా జూన్ 21న జరుగు తున్న యోగా దినోత్సవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖరీదైన ఈవెంట్ మాదిరిగా పెద్దఎత్తున చేస్తున్న ప్రచారమే దీనికి నిదర్శనం. ఇప్పటికే రెండుకోట్ల మందికిపైగా ఎన్రోల్ చేసు కున్నట్లు చెప్తున్నారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ఆర్కే బీచ్లో ప్రధాని మోడీ పాల్గొంటు న్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఈ యోగా కార్యక్రమంలో ఐదు లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొం టారని, దీనికోసం రూ.యాభై కోట్లు మంజూరు చేసినట్టు వార్తలు.యోగాంధ్ర పేరుతో నెల రోజులుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇదంతా ఎవరి ప్రయోజనం కోసం? మరీ ముఖ్యంగా యోగాకి హిందూమతానికి లింక్ పెట్టి, హిం దూత్వ సిద్ధాంతాన్ని జనానికి ఎక్కించే ప్రయత్నం ప్రభుత్వ కార్యక్రమంగా చేయడం శోచనీయం. అందుకు మన రాష్ట్రం వేదికగా మారడం విచారకరం. కార్పొరేట్ సంస్థలు దీన్ని వ్యాపార అవకాశంగా మార్చుకుని, యోగా పాఠ శాలలు, బ్రాండెడ్ యోగా కేర్, ప్రత్యేక శిబిరాల పేరుతో వ్యాపారం చేసుకుంటున్నాయి. ‘ఇంతవరకూ తత్వవేత్తలు ప్రపంచాన్ని గురించి వివరించారు. కావల్సింది దాన్ని మార్చడం’ అంటారు కారల్ మార్క్స్. ‘మన చేతుల్లో ఏముంది? అంతా దైవ నిర్ణయం’ అంటారు ఆధ్యాత్మికవాదులు. అయితే, అంతా మన చేతుల్లోనే వుందనీ, మనం ఏం చేయాలనుకుంటే అది చేసెయ్యగలమనీ మార్క్స్ చెప్పలేదు. ప్రకృతి, సమాజం… నిరంతరం మారుతుం టాయనీ, ఈ ప్రక్రియలో మనం జోక్యం చేసుకుని ఆ మార్పును అభివృద్ధి వైపు పయనింపజేయాలనీ చెప్పాడు. యోగాని కూడా ఈ విధంగానే చూడాలి. ‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయష’ అన్నట్లుగా… అంతా యోగాలోనే వుందనే రాజకీయ ప్రచారం నుంచి బయటపడాలి. రాజకీయ, వ్యాపార, మత ప్రయోజనాలకు అతీతంగా, మానవ ఆరో గ్యానికి మేలు చేసే సాధనగా యోగాను ప్రోత్సహించాలి. అంతేగాని యోగా పేరుతో హిందూత్వ సిద్ధాంతాన్ని ప్రచారం చేసి, విద్వేష రాజకీయాలకు పురిగొలిపే ప్రచార ఆర్భాటాలకు ప్రజలు దూరంగా వుండాలి.
ఎవరి కోసం?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES