7,578 రెవెన్యూ సదస్సుల్లో 4.61 లక్షల దరఖాస్తులు స్వీకరణ : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను నిర్ధేశించిన గడువులోగా పరిష్కరించాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణపై అధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల మూడు నుంచి హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 561 మండలాల్లో 7,578 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ సదస్సుల్లో 4.61 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈసదస్సులు ఈ నెల 20 వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వీలైనంత త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఆగస్టు 15నాటికి అన్ని భూ సమస్యలను పరిష్కరించాలని ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందనీ, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా క్షేత్రస్ధాయిలో అధికార యంత్రాంగం పనిచేయాలని ఆదేశించారు. గత పదేండ్ల కాలంలో భూ సమస్యలకు సంబంధించి రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని వివరించారు. ధరణి చట్టం వచ్చాక తమ ప్రమేయం లేకుండానే రైతులు భూ సమస్యల్లో చిక్కుకున్నారని గుర్తు చేశారు. సమస్యలను పరిష్కరించాల్సిన రెవెన్యూ యంత్రాంగం ధరణి కారణంగా ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని తెలిపారు. ప్రతిదానికి కోర్టు మెట్లు ఎక్కడమేతప్ప రైతుకు మరోదారి లేకుండా పోయిందన్నారు. దాదాపు గత రెండు నెల్లుగా భూభారతి చట్టంలో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో దాదాపు 50 ప్రాంతాల్లో తాను స్వయంగా పాల్గొనడం జరిగిందనీ, ఆసదస్సుల్లో రైతులు తమ గోస చెప్పుకోవడం తనను ఎంతో బాధకు గురిచేసిందన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చామని చెప్పారు. ఈ చట్టాన్ని క్షేత్రస్ధాయిలో పకడ్బందీగా రైతులకు మేలు చేసేలా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. తరతరాలుగా సర్వే చేయని, సర్వే రికార్డులు లేని ఐదు నక్షా గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన భూసర్వే శరవేగంగా సాగుతోందని మంత్రి తెలిపారు. నక్షా గ్రామాలను గత ప్రభుత్వం గాలికి వదిలేస్తే ఇందిరమ్మ ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో సర్వే చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో 413 నక్షా గ్రామాలకు గాను ఐదు గ్రామాలలో ప్రయోగాత్మకంగా గత నెల మూడో వారం నుంచి సర్వేను ప్రారంభించినట్టు తెలిపారు. చిన్న వివాదాలకు తావులేకుండా రైతుల సమక్షంలోనే క్షేత్రస్ధాయిలో భౌతికంగా సర్వే జరుగుతోందని మంత్రి వివరించారు.
నిర్దేశించిన గడువులోగా భూ సమస్యల పరిష్కారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES