Tuesday, June 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవైద్యవిద్యను నాసిరకంగా మార్చి దొంగ ఏడ్పులు

వైద్యవిద్యను నాసిరకంగా మార్చి దొంగ ఏడ్పులు

- Advertisement -

– హరీశ్‌రావు ట్వీట్‌పై మంత్రి దామోదర రీట్వీట్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

వైద్యవిద్యను నాసిరకంగా మార్చిన మాజీ మంత్రి హరీశ్‌రావు ఇప్పుడు దొంగ ఏడ్పులు ఏడుస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. హరీశ్‌రావు ఎక్స్‌ వేదికగా చేసిన ట్వీట్‌కు సోమవారం మంత్రి దామోదర రీట్వీట్‌ చేశారు. ప్రతి కాలేజీని కాపాడుకుంటామని విద్యార్థులకు భరోసానిచ్చారు. ”మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయడమంటే పేపర్ల మీద జీవోలు ఇచ్చుడు కాదు. కాలేజీకి బిల్డింగుండాలి. ఎంబీబీఎస్‌ సీట్లకు అనుగుణంగా హాస్పిటల్‌ ఉండాలి. ఫ్యాకల్టీ ఉండాలి. హాస్పిటల్‌లో, కాలేజీలో మౌలిక వసతులు ఉండాలి. విద్యార్థులకు హాస్టల్స్‌ ఉండాలి. ఇలా అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తేనే కాలేజీ ఏర్పాటు చేసినట్టు” అని మంత్రి పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం గాల్లో మేడలు, కాగితాలపై కాలేజీలను చూపించి, వైద్య విద్యను గత ప్రభుత్వం నాసిరకంగా మార్చిందని విమర్శించారు. సరియైన ప్రణాళిక లేకుండా, ఫ్యాకల్టీని నియమించకుండా, బిల్డింగులు కట్టకుండా, మౌలిక వసతులు కల్పించకుండా మెడికోల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టారని మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు కాలేజీలకు ఎన్‌ఎంసీ నోటీసులు రాగానే దొంగ ఏడుపులు ఏడుస్తూ, విద్యార్థులను వారి తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేసేలా ట్వీట్లు చేస్తున్నారని తప్పుపట్టారు. బీఆర్‌ఎస్‌ హయాంలో నోటీసులే రానట్టుగా, నోటీసులు రావడం ఇదే మొదటిసారి అన్నట్టుగా వ్యవహరిస్తూ హరీశ్‌రావు మరోసారి తన గోబెల్స్‌ మనస్తత్వాన్ని చాటుకున్నారని మంత్రి దామోదర విమర్శించారు. ”బీఆర్‌ఎస్‌ నాశనం చేసిన ప్రభుత్వ విద్య, వైద్య వ్యవస్థను మేము గాడిలో పెడుతున్నాం. ఏడాదిన్న రలో ఆరోగ్యశాఖలో 8 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రతి కాలేజీకి, హాస్పిటల్‌కు బిల్డింగులను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఫ్యాకల్టీని నియమిస్తున్నాం. మౌలిక వసతులు కల్పిస్తూ ముందుకెళ్తున్నాం.” అని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి కాలేజీని కాపాడుకుంటామని, ఒక్క సీటు కూడా పోకుండా చర్యలు తీసుకునే బాధ్యత తమ ప్రభు త్వానిదని విద్యార్థులకు మంత్రి భరోసానిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -