సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : ప్రభుత్వం ఇచ్చిన జి.ఓ 7 ప్రకారం అర్హత ఉన్న నిరుపేదలైన వారికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో మొదటి ప్రాధాన్యతగా గుర్తించి ఇవ్వాలని, ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో రాజకీయాలు తగవని, ఇప్పటికైనా ఇండ్లు కావలసిన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవన్, భువనగిరిలో సీపీఐ(ఎం) భువనగిరి మండల కమిటీ సమావేశం మండల కార్యదర్శివర్గ సభ్యులు కొండ అశోక్ అధ్యక్షతన జరుగగా ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నరసింహా హాజరై, మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వము లాగా కాకుండా సంక్షేమ పథకాలను అర్హత కలిగిన వారందరికీ అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక్కొక్క గ్రామంలో నిజమైన లబ్ధిదారులను పదుల సంఖ్యలో తొలగిస్తున్నారని నర్సింహ ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు గ్రామాలలో నిజమైన లబ్ధిదారులను మరో మారు గ్రామ సభలు పెట్టి అందరి సమక్షంలో ఎంపిక చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీ కాంగ్రెస్ గ్రామ కమిటీలుగా మారాయని అన్నారు.
ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చూడాలని గ్రామాల అభివృద్ధిల విషయంలో, సంక్షేమ పథకాల విషయంలో లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో ప్రజలందరినీ, అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి అందరి సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తేనే నిజమైన పేదలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికైనా అర్హత కలిగిన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఇవ్వకపోతే మండల వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలను సమీకరించి గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఆందోళన చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ , కొండమడుగు నాగమణి, మండల కమిటీ సభ్యులు సిలువేరు ఎల్లయ్య , పాండాల మైసయ్య , కొండపురం యాదగిరి, మధ్యపురం బాల నరసింహ, కళ్లెం లక్ష్మీనరసయ్య లు పాల్గొన్నారు.