ప్రధానితో ఈ అంశంపై చర్చించాలి : రౌండ్ టేబుల్
సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోలవరం ముంపు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ నెల 25న తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రగతి ఎజెండా పేరిట ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్వహించబోయే సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. పోలవరం ముంపు, ఏపీలో కలిపిన భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలనే డిమాండ్లపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఏపీలో కలిపిన ఫురుషోత్తపట్నం, గుండాల, ఏటపాక, కన్నాయగూడెం, పిచ్చుకలపాక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వారు రెండు రాష్ట్రాల మధ్య వివక్షకు గురవుతూ, ఏ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉన్నారని వివరించారు. కరకట్టల ఎత్తు పెంచుకుంటేనే భవిష్యత్తులో ఐదు గ్రామాలకు రక్షణ ఉంటుందనీ, భారీ వరదలొస్తే అన్ని గ్రామాలు మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం వల్ల భద్రాచలం ప్రాంతానికి శాశ్వత ముంపు ఏర్పడిందని తెలిపారు. పోలవరం స్పిల్ వే సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచుకోవడం వల్ల తెలంగాణకు బ్యాక్ వాటర్ సమస్య ఏర్పడుతుందనీ, భద్రాచలం రామాలయం మునిగిపోయే ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో కలిపిన పురుషోత్తపట్నంలో భద్రాచలం రాముడికి చెందిన దేవుని మాన్యం భూమి వెయ్యి ఎకరాలుందనీ,అది ఆంధ్రాకి పోయిందని తెలిపారు.ఆ భూమి అన్యాక్రాంతమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ముంపుపై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సంయుక్త సర్వే నిర్వహించాలని సూచించారు. ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
పోలవరం ముంపు గ్రామాలను తిరిగి తెలంగాణకివ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES