ఉపాధి హామీకి నిధుల కోత : వ్యకాస అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
నవతెలంగాణ- వలిగొండ
మోడీ ఆర్థిక విధానాల వల్ల, వారి పాలనలో వ్యవసాయ కార్మికులు, పేదలు, కౌలు రైతులకు రక్షణ లేకుండా పోయిందని, ఈ కాలంలో 60 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. ఉపాధి హామీకి నిధులు కోత పెట్టి కార్పొరేట్ శక్తులకు మాత్రం పెద్దఎత్తున సబ్సిడీలు ప్రకటించారని విమర్శించారు. యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని సాయి గణేష్ ఫంక్షన్ హాల్లో శనివారం వ్యకాస జిల్లా మాజీ అధ్యక్షులు వేముల మహేందర్ 4వ వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన ”వ్యవసాయ కార్మికులు, ఉపాధి – పాలకుల వైఖరి”పై నిర్వహించిన సదస్సులో వెంకట్ మాట్లాడుతూ.. ఆరోగ్యం బాగుండాలంటే యోగ ఒక్కటే కాదని.. ప్రజలందరికీ తినడానికి పౌష్టికాహారం ఉండాలని, ప్రభుత్వం పౌష్టికాహారమందించాలని డిమాండ్ చేశారు. వామపక్షాల పోరాట ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని చెప్పారు. ప్రధాని మోడీ విధానాల వల్ల భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, లౌకిక తత్వానికి ప్రమాదం ఏర్పడిందని అన్నారు. వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటీ 50 లక్షల ఎకరాల మిగులు భూములు ఉన్నాయని, ఆ భూములన్నింటినీ భూమి లేని ప్రతి పేద కుటుంబానికీ రెండు ఎకరాల చొప్పున పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కోనేరు రంగారావు భూ సిఫారసులను అమలు చేసి పేదలకు ప్రభుత్వ భూములను పంచాలన్నారు. వ్యకాస జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు జల్లెల పెంటయ్య, బీఎస్పీ రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్య, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి తుర్కపల్లి సురేందర్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కందడి సత్తిరెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు పాల్గొన్నారు.
వ్యవసాయ కార్మికులకు,పేదలకు రక్షణ లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES