నవతెలంగాణ – భూపాలపల్లి : డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో మహిళా, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నాషా ముక్త్ భారత్ అభియాన్ సమావేశంలో కలెక్టర్ పా ల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యువత డ్రగ్స్ కి అలవాటు పడుతూ వ్యసనాలకు బలి అవుతున్నారని తెలిపారు. ఈ భయంకరమైన వ్యసనాల నుండి ప్రజలను కాపాడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. దీని ప్రభావం కుటుంబాల మీద, సమాజం మీద పడుతోందని, అందుకే అందరూ చైతన్యంతో డ్రగ్స్ నిర్మూలనకు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు.
కలెక్టర్ ఈ సందర్భంగా నాషా ముక్త భారత్ లక్ష్యాలను వివరించి, డ్రగ్స్ మహమ్మారి నియంత్రణకు శాఖల వారిగా చెప్పట్టాల్సిన అవగాహన కార్యక్రమాల ప్రాముఖ్యతను గుర్తు చేశారు. సమాజంలో యువతను వ్యసనాల నుంచి రక్షించే దిశగా విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు కలిసికట్టుగా పని చేయాలని విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, సంక్షేమ అధికారి మల్లీశ్వరి, ఆబ్కారీ ఈ ఎస్ శ్రీనివాస్, అదనపు ఎస్పీ నరేష్ కుమార్, ఆర్డీఓ రవి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.