Wednesday, June 25, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి50 ఏళ్ల అనంతరం- సరికొత్త తీవ్ర ప్రమాదం

50 ఏళ్ల అనంతరం- సరికొత్త తీవ్ర ప్రమాదం

- Advertisement -

1975 జూన్‌ 20వ తేదీన అర్ధరాత్రి అంతర్గత అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ ప్రకటనకు దారి తీసిన అపఖ్యాతికరమైన పరిణామ క్రమం గుర్తుచేసుకోవడం కొంచెం విపరీతంగా కనిపించవచ్చు. ఏమైనా విజ్ఞతా యుతమైన ఈ చిరస్మరణీయ వాక్యాలు మాత్రం మనకు గుర్తుకు వస్తాయి. ”చరిత్ర పాఠాలు మరిచిపోయిన వారు మళ్లీ పునరావృతానికి బలి కాక తప్పదు”. భారత ప్రజాస్వామ్య చరిత్రలోని ఆ చీకటి అధ్యాయాన్ని మరోసారి దర్శించడాన్ని ఈ మాటలే అనివార్యం చేస్తున్నాయి. 1960లలో కాంగ్రెస్‌ పార్టీ గుత్తాధిపత్యానికి పెద్ద దెబ్బ తగిలింది. అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్షాల కూటములు విజయాలు సాధించాయి. ఇందుకు ప్రతిస్పందనగా శ్రీమతి ఇందిరా గాంధీ ప్రగతిశీలంగా ధ్వనించే బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి నినాదాల పరంపరతో తన స్థానాన్ని పున:స్థాపించుకున్నారు. సంప్రదాయ రాజకీయ పద్ధతులను విడనాడి తన చేతుల్లోనే అధికారాన్ని ఆమె కేంద్రీకరించుకున్నారు. రాష్ట్ర స్థాయిలోని బలమైన నేతలను బేఖాతరు చేస్తూ నేరుగా జన బాహుళ్యంతో మాట్లాడటం మొదలుపెట్టారు.
ఏకపార్టీ పెత్తనం నుంచి ఎమర్జెన్సీకి
ఈ వైఖరి శ్రీమతి గాంధీకి కొన్ని లాభాలు కలిగించింది గానీ బంగ్లాదేశ్‌ విమోచన పోరాటం వల్లనే ఆమె రాజకీయ ఆధిపత్యానికి నిజంగా ఊపు వచ్చింది. ఉత్తరోత్తర స్వతంత్ర బంగ్లాదేశ్‌ ఆవిర్భవించటం, పాకిస్తాన్‌ నిర్ణయాత్మకంగా ఓడిపోవడం ఆమె స్థాయిని పెంచాయి. పాకిస్తాన్‌ సైనిక ప్రభుత్వాన్ని కాపాడేందుకోసం అమెరికా జోక్యం చేసుకోకుండా నాడు ఉనికిలో వున్న సోవియట్‌ యూనియన్‌ ఆపగలిగిన పరిస్థితి కూడా కీలక పాత్ర వహించింది.ఇలా నిలదొక్కుకున్న శ్రీమతి గాంధీ స్థాయి పెరగడంతో 1971 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించేలా చేసింది. అయినప్పటికీ ఈ మొత్తం అనుకూల పరిస్థితిలోనూ సీపీఐ(ఎం)ను మాత్రం ఆమె ఆపలేకపోయారు. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో అది ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. కానీ దీన్ని ఆమె సహజంగా సాగనివ్వలేదు. 1972 అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా రిగ్గింగ్‌ చేసి ఐదేళ్లపాటు అర్ధ ఫాసిస్టు నిర్బంధానికి బాట వేశారు. ఈ నిరంకుశత్వం కాలం 1975 జూన్‌ 25న ప్రకటించిన అత్యవసర పరిస్థితితో చాలా నిరాటంకంగా కలగలిసిపోయింది.
ఎమర్జెన్సీ దారుణాలు
ఎమర్జెన్సీ కాలంలో చాలావరకు శ్రీమతి గాంధీ రాజకీయ ప్రత్యర్థులను జైల్లో పెట్టారు. పత్రికలపై సెన్సార్‌ విధించారు. పాత్రికేయులు, కార్యకర్తలు జైళ్లపాలయ్యారు. ఈలోగా మరోవైపు దేశం ఆర్థిక సవాళ్లు ఎదుర్కోవలసి వచ్చింది. పాకిస్తాన్‌తో అప్పుడే ముగిసిన యుద్ధం, కరువులు, 1973 ప్రపంచ చమురు సంక్షోభం వంటివి, నిరుద్యోగం పెరుగుదల, ద్రవ్యోల్బణం ప్రజల అసంతఅప్తికి రాజకీయ ప్రతికూలతకు మరింత ఆజ్యం పోశాయి. ఈ పెరుగుతున్న ఒత్తిళ్లు, శ్రీమతి గాంధీలో పెరిగిన వ్యక్తిగత అభద్రత, చట్టపరమైన ఎదురుదెబ్బలు, ప్రత్యేకించి లోక్‌సభ సభ్యత్వం కోల్పోయే ప్రమాదం, ఇవన్నీ ఎమర్జెన్సీ విధింపునకు దోహదపడ్డాయి.ఈ విధంగా 1975 ఎమర్జెన్సీ అనేక రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాల కలయికతో జరిగింది. యుద్ధం, బయటి నుంచి దురాక్రమణ ప్రమాదం, అంతర్గత కల్లోలం సందర్భంలో ఎమర్జెన్సీ విధించడానికి అవకాశం ఇచ్చే రాజ్యాంగం 352వ అధికరణాన్ని ప్రభుత్వం ప్రయోగించింది. అధికారిక ప్రకటనలో జాతీయ భద్రతకు ముప్పు, ప్రజాజీవితానికి ప్రమాదం అందుకు కారణాలుగా పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులు అణచివేయడానికి కార్యనిర్వాహక వర్గం మొత్తం అధికారాలు చేజిక్కించుకోవడానికి ఇది దారితీసింది.
ఎకెజి ఏం చెప్పారు?
ఎమర్జెన్సీ విధింపునకు దారితీసిన రాజకీయ పరిణామాలను పార్లమెంట్‌లో సీపీఐ(ఎం)నాయకుడు ఎ.కె.గోపాలన్‌ ఎండగట్టారు. 1975 జులై 21న ఎమర్జెన్సీ ప్రకటన ఆమోదానికై చట్టబద్ధ తీర్మానం చర్చకు పెట్టినప్పుడు దాన్ని ప్రారంభిస్తూ ఆయన ఇలా చెప్పారు ”ఏక పార్టీ నియంతృత్వం వైపుగా పెరుగుతున్న పోకడల గురించి మా పార్టీ చేసిన హెచ్చరిక సరైందని ఎమర్జెన్సీ హఠాత్‌ ప్రకటనతో నిరూపితమైంది”. లోతుగా వేళ్లూనుకున్న వ్యక్తిగత రాజకీయ సంక్షోభం నుంచి తమను, తమ నాయకురాల్ని రక్షించుకోవడానికి పాలక పక్షం ఈ ఆకస్మిక చర్యకు పాల్పడటం బలహీనతను చెప్పేదే తప్ప బలాన్ని సూచించడం లేదన్నారు. ప్రతిపక్షాలు, ప్రజా ఉద్యమాలను గొంతు నొక్కేందుకు ఈ పథకం పన్నినట్లు చెప్పారు. మితవాద, అతివాద దుస్సాహసిక శక్తులను అణచివేసేందుకే ఎమర్జెన్సీ విధించినట్టు సృష్టించిన తప్పుడు కథనాన్ని ఆయన బట్టబయలు చేశారు.తర్వాత కాలంలో అనివార్యంగా జరగాల్సిందే జరిగింది. కాంగ్రెస్‌తో సహా ఇందిరాగాంధీ రాజకీయ ఓటమిని ఆపలేక పోయారు. 18 మాసాల ఎమర్జెన్సీ కాలం సమకాలీన భారతదేశ చరిత్రలో ఒక దారుణమైన అపశృతిగా ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసిన వికృత చర్యగా నిలిచిపోయింది. 1977 లోక్‌సభ ఎన్నికల్లో వివిధ శక్తుల విస్తృత కలయిక దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించ గలిగింది.
మోడీ పాలన పాఠాలు
ఈరోజున నరేంద్ర మోడీ ఎమర్జెన్సీ యుగాన్ని ప్రస్తావిస్తున్నారు. దాన్ని 1975 జూన్‌ 25న ప్రకటించటం రాజ్యాంగంపై నల్లని మచ్చగా అభివర్ణిస్తున్నారు ”ఎమర్జెన్సీ తర్వాత గడచిన 50 ఏళ్లు మనకు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని సగర్వంగా కాపాడుకోవాలని గుర్తు చేస్తున్నాయి. దేశ ప్రజలు అలాంటి దుస్థితి మళ్లీ ఎప్పుడూ జరగనివ్వరాదని రానివ్వరాదని ప్రతిజ్ఞ పూనాలి. సజీవమైన ప్రజాస్వామ్యం ఉండేలా, భారత రాజ్యాంగం నిర్దేశించినట్టు సామాన్య ప్రజల స్వప్నాలు సఫలం చేసేందుకు మనం మనం కట్టుబడి ఉండాలి” అని మోడీ ప్రకటిస్తున్నారు. అయితే ఆయన ఇలాంటి భంగిమ దాల్చి ఇవన్నీ చెప్పడం ఒక పెద్ద బూటకం లాగా మారిపోతున్నది. భారత ప్రజాస్వామ్యం పైన దారుణమైన దాడిని కప్పిపుచ్చడానికి ప్రయత్నమే ఇది అని ఆయన హయాంలో గత పదకొండేండ్ల కాలం స్పష్టం చేస్తున్నది.
పొసగని పోలిక
యాభయ్యేళ్ల తర్వాత వెనక్కు తిరిగి చూసుకుంటే ఎమర్జెన్సీ అనేది భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన తొలి ప్రధాన దాడిగా కనిపిస్తాయి. పౌర స్వేచ్ఛలను, ప్రజాస్వామిక హక్కులను అది కాలరాసింది. అయితే చాలామంది చేస్తున్నట్టుగా 1975 నాటి ఎమర్జెన్సీని ప్రస్తుత పరిస్థితిని ప్రత్యక్షంగా పోల్చి చూపడం ఒక పొరపాటు అవుతుంది. మోడీ నాయకత్వంలోని గత దశాబ్ది కాలాన్ని ”అప్రకటిత ఎమర్జెన్సీ” అనడం తరచూ జరుగుతుంటుంది కానీ అలాంటి పోలిక సరైంది కాదని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా పచ్చి మితవాద శక్తులు తిరిగి పుంజుకున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి ముందుకొచ్చింది. రాజకీయ శక్తుల పొందిక సామ్రాజ్యవాదానికి అనుకూలంగా మారిన నేపథ్యం ఇది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలను ద్రవ్య పెట్టుబడి నడిపించే యుగం మొదలైన దశ. తీవ్రమైన అసమానతలు, ముమ్మర నిరుద్యోగం ముంచెత్తే కార్పొరేట్‌ ప్రాబల్యం దీని లక్షణాలుగా వున్నాయి. వీటికి తోడు ఇదివరకెన్నడూ లేని స్థాయిలో అస్తిత్వ ప్రాతిపదికన సమీకరణలు, అంతులేని విద్వేష ప్రచారాలు సాటి పౌరులనే ”పరాయి”గా చూపించడం ఆర్థిక, రాజకీయ రంగ ఆర్థిక సామాజిక రంగాల్లో సాగిపోతున్నది.
విశ్వాసం పెంచిన పోరాటం
ఈ విధంగా చూస్తే ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగ సూత్రాలపై ప్రస్తుత దాడి మరింత ప్రమాదకరమైంది. నిరంకుశత్వం వ్యవస్థీకృతం కావడం కావడానికి ఇది దారితీసింది. కొంతమంది పరిశీలకులు దీనికే ”ఎన్నికలతో నిరంకుశత్వం” అనే పదం వాడుతున్నారు. భారతదేశ సందర్భంలో చూస్తే ఈ నిర్ణయాత్మక మార్పులో ఆరెస్సెస్‌ అగ్రస్థానం వహిస్తున్నది. భారతదేశం అన్న భావననే తలకిందులు చేసే విషపూరిత భావజాలంగా హిందుత్వను జొప్పిస్తున్నది. భారతదేశం అనే ఈ భావన వలసవాద వ్యతిరేక పోరాట క్రమంలో పుట్టింది. ఒక ప్రజాస్వామ్య, లౌకిక, సామాజిక, న్యాయబద్ధమైన సమాఖ్య రిపబ్లిక్‌గా నడిపించింది. ఇప్పుడు జరుగుతున్న ఈ దాడి అందుకనే మరింత విస్తృతమైనది, విచ్ఛిన్నకరమైనది. భారత పౌరసత్వ వ్యవస్థాపక సూత్రాలనే ధ్వంసం చేయడానికి ఉద్దేశించబడింది. సాధారణ దృష్టితో చెప్పాలంటే ఈ రోజున మనం అనుభవిస్తున్న పూర్తి స్థాయి నిరంకుశత్వంతో పోలిస్తే 1975 ఎమర్జెన్సీ అపరిపక్వ వ్యవహారంగా కనిపిస్తుంది. ప్రస్తుత పాలన వ్యవస్థను తొలగించటం మరింత కష్టమని అనిపించవచ్చు కానీ 1970లలో ఎమర్జెన్సీని ఎదిరించి పోరాడిన అనుభవం గుర్తు చేసుకుంటే విశ్వాసమే కలుగుతుంది. ఆరెస్సెస్‌ ప్రమాదకర భావజాలాన్ని తిప్పి కొట్టాలనే సంకల్పంతో ప్రజానీకం సమైక్యమైతే ప్రజాస్వామ్యాన్ని తిరిగి నిలబెట్టుకోవడం, ప్రస్తుత సవాళ్లను అధిగమించటం సాధ్యమే అవుతుంది.
(జూన్‌ 18 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -