నవతెలంగాణ – న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు నాలుగోరోజు కొనసాగుతున్నాయి. ఉభయ సభలనుద్దేశించి నేడు రాష్ట్రపతి ప్రసంగించారు. అమృతకాలం మొదట్లో 18వ లోక్సభ కొలువుతీరిందని అన్నారు. తమ ప్రభుత్వం పదేళ్లుగా దేశాభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. కొత్తగా ఎన్నికై వచ్చిన ఎంపిలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సారి ఎన్నికలు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ ఎన్నికల గురించి ప్రపంచమంతా చర్చించుకుంటోంది. జమ్ముకాశ్మీర్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటేశారు. దేశంలోని మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
దేశంలో సంస్కరణలు మరింత వేగం పుంజుకుంటాయి. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తోంది. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు పంటసాయం అందిస్తున్నాం. ఐటి నుండి టూరిజం వరకు అన్ని రంగాల్లో భారత్ దూసుకుపోతుంది. వ్యవసాయ ఆధారిత ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఆర్గానిక్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ప్రపంచవృద్ధిలో భారత్ 15 శాతం భాగస్వామ్యమవుతోందని అన్నారు. పదేళ్లలో 3 లక్షల 80 వేల కి.మీ పైగా జాతీయ రహదారులను నిర్మించామని అన్నారు.