నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఉన్నత న్యాయప్థానం బుధవారం కీలక తీర్పు వెలువరించింది. గ్రామపంచాయతీ ఎన్నికలు 3 నెలల్లో నిర్వహించాలని, 30 రోజుల్లో వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశిచింది.
స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు గతేడాది జనవరి 31తో ముగిసినా ఎన్నికల నిర్వహణలో జాప్యం ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ప్రశ్నించింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ పలువురు మాజీ సర్పంచులు దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తొలుత పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ”వెంటనే ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలి. లేకుంటే పాత సర్పంచులకే బాధ్యతలు అప్పగించాలి’’ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్ఖాన్ వాదనలు వినిపిస్తూ… సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి మరో నెల రోజుల గడువు కావాలని కోరారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ఎన్నికల నిర్వహణపై గతంలో ఒకసారి హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ఇది పూర్తికాగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపాక.. ప్రక్రియ పూర్తి చేయడానికి రెండు నెలల సమయం పడుతుందన్నారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ సకాలంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఎన్నికల సంఘం చొరవ తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినందున… ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. న్యాయవాది సమాధానమిస్తూ..రిజర్వేషన్ల ఖరారుతో పాటు ఎన్నికలకు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి మూడు నెలల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.