దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ
పెరుగుతున్న ఫాసిస్టు ధోరణులు…ప్రశ్న వల్లే ఎన్డీఏ కూటమికి సీట్లు తగ్గాయి
ఎమర్జెన్సీ నాడు-నేడు అంశంపై సీపీఐ(ఎం) సదస్సులో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వాలు పాలన కొనసాగిస్తున్నాయనీ, మోడీ స్టీరింగ్ కార్పొరేట్ల చేతుల్లో ఉందని పలువురు వక్తలు స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ హయాంలో దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ‘నాడు ప్రకటిత ఎమర్జెన్సీ-నేడు అప్రకటిత ఎమర్జెన్సీ-మన కర్తవ్యాలు’ అంశంపై సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అధ్యక్షతన సదస్సు జరిగింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) మాజీ కమిషనర్ మాఢభూషి శ్రీధర్ మాట్లాడుతూ రాజ్యాంగం, అందులోని సూత్రాలను విస్మరించి నాడు ఎమర్జెన్సీని ప్రకటించారని చెప్పారు. ఈ విషయంలో ఆనాటి రాష్ట్రపతి బాధ్యతగా వ్యవహరించలేదన్నారు. కనీసం కేంద్ర క్యాబినెట్ను కూడా సమావేశ పరచకుండా ఆగమేఘాల మీద ఈ చర్య తీసుకోవటం సమర్ధనీయం కాదన్నారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పునిచ్చారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు, సీజేఐ, పార్లమెంట్, పీఎం అందరికన్నా రాజ్యాంగమే గొప్పదని తెలిపారు. దాన్ని బుల్డోజ్ చేస్తే ప్రజలే రాజ్యాంగాన్ని రక్షించుకుంటారనే విషయాన్ని ఆనాటి ఘటనలు చెబుతున్నాయని వివరించారు. ప్రశ్న అనేది అభివృద్ధికి మూలమన్నారు. నాలుగొందల సీట్లు వస్తాయని కలలుగన్న వారికి ప్రశ్నించే శక్తులు పెరగటంతో అనుకున్న సీట్లు రాలేదని గుర్తు చేశారు. అసమ్మతి, విమర్శించటం, విచక్షణ, వ్యతిరేకించటం అత్యంత సహజమైనవిగా ఉండాలన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా వెన్నుముకతో నిలబడాలని సూచించారు.
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ అప్పుడైనా..ఇప్పుడైనా ప్రభుత్వాన్ని నడుపుతున్నది ప్రధానులు కాదనీ, వారు కేవలం డ్రైవర్లు మాత్రమేనని చెప్పారు. పరిపాలనకు డైరెక్షన్ చేసేది కార్పొరేట్లేనని అన్నారు. కారు డ్రైవర్గా మోడీ ఉంటే.. వెనుక సీట్లో కూర్చోని ‘లెఫ్ట్, రైట్, స్ట్రైట్’ అంటూ చెప్పేది పెట్టుబడిదారులేనని వివరణ ఇచ్చారు. 1960లో కాంగ్రెస్ పార్టీ గుత్తాధిపత్యానికి పెద్ద దెబ్బ తగిలిందన్నారు. అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్షాల కూటములు విజయాలు సాధించాయని చెప్పారు. 1970 నాటికి తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయనీ, నిత్యావసర వస్తువుల ధరల విపరీతంగా పెరుగటం, నిరుద్యోగం ఇత్యాది సమస్యలు పెరిగిన నేపథ్యంలో వాటన్నింటినీ పక్కతోవ పట్టిస్తూ, అధికారాన్ని కాపాడుకోవడం కోసం అనాటి ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించిందని వివరించారు. ఇప్పుడు కూడా ఆనాటి ఎమర్జెన్సీలాంటి పరిస్థితులే వచ్చాయన్నారు. పెట్టుబడికి నష్టం వస్తే, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని చెప్పారు. పెట్టుబడి ప్రయోజనాలు ముందుకు పోవాలంటే హక్కులు, చట్టాలు పోరాటాలు, సమ్మెలు ఆటంకంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే నాలుగు లేబర్కోడ్లు, ఇతర సవరణలు తీసుకొస్తున్నారని తెలిపారు.
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి జ్యోతి మాట్లాడుతూ ఎమర్జెన్సీ కాలంలో ఎన్నో దారుణాలు జరిగాయన్నారు.ó రాజకీయ ప్రత్యర్థులను జైల్లో పెట్టారనీ, పత్రికలపై సెన్సార్ విధించారనీ, పాత్రికేయులు, కార్యకర్తలు జైళ్ల పాలయ్యారని చెప్పారు. నాటి ప్రభుత్వం ప్రతిపక్షాలు, ప్రజా ఉద్యమాల గొంతు నొక్కేందుకు పూనుకుందన్నారు. నేటి మోడీ పాలన కూడా ఎమర్జెన్సీ కాలాన్ని మరిపిస్తోందని విమర్శించారు. అన్ని రకాల హక్కులు హరించబడుతున్నాయనీ, ఎక్కడా స్వేచ్ఛ లేదనీ, గొంతెత్తిన వారిని జైళ్లలో కుక్కుతున్నారనీ, లేదంటే హత్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు మీసా ఉంటే..నేడు ఉపా చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని చెప్పారు.
మహిళలపై హింస పెరిగిందనీ, దాడులు చేసిన వారికి ప్రభుత్వ పెద్దలే వత్తాసుగా ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి అని గొప్పలు చెప్పుకుంటున్న మోడీ సర్కార్…17 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇతర మతస్తులను పెండ్లి చేసుకోవటాన్ని తప్పు పడుతూ చట్టం తీసుకొచ్చారని తెలిపారు. అప్రకటిత ఎమర్జన్సీని కొనసాగిస్తున్న మోడీకి ఎమర్జన్సీ వ్యతిరేక దినంగా పాటించే నైతిక హక్కులేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కంట్రోల్ కమిషన్ చైర్మెన్ డీజీ నర్సింహారావు వక్తలను స్టేజీ మీదికి ఆహ్వానించారు.
మోడీ స్టీరింగ్ కార్పొరేట్ల చేతుల్లో..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES