– రాష్ట్ర ఆటో మోటార్ సంఘాల జేఏసీ పిలుపు
నవతెలంగాణ – ముషీరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని రాష్ట్ర ఆటో మోటార్ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. బుధవారం హైదరాబాద్ విద్యానగర్లోని మార్క్స్ భవన్లో టీయూసీఐ అనుబంధ తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వి.ప్రవీణ్ అధ్యక్షతన ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమ్మెను రాష్ట్ర ఆటో మోటార్ సంఘాలు అన్నీ సంపూర్ణంగా బలపరుస్తూ పాల్గొంటాయని ప్రకటించారు. కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీస పెన్షన్ నెలకు రూ.9000, కాంట్రాక్ట్, ఫిక్స్ టర్మ్స్ సిస్టం రద్దుచేసి మొత్తం కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు. కేంద్ర రవాణా (సవరణ) చట్టం 2019 సవరించాలని, మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జులై 3, 4, 5, తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆటో, లారీ, టాక్సీ, వ్యాన్, ట్రాలీ, గూడ్స్ తదితర వాహనాలతో ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జులై 9న రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించాలని, రవాణా రంగం సంపూర్ణంగా బంద్లో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో టీయూసీఐ నాయకులు ప్రవీణ్, లింగం గౌడ్, మహమ్మద్ అఫ్జల్, ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు జి.మల్లేష్ గౌడ్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశం, నాయకులు ఎస్.అశోక్, సీఐటీయూ నాయకులు పి.శ్రీకాంత్, బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్య, ఐఎఫ్టీయూ నాయకులు చిన్నం బాల నరసింహ, పి.రామ్రెడ్డి, టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు పి.యాదగిరి, నాయకులు ఎల్.కొండల్ తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES