నవతెలంగాణ కోదాడ: గుర్తుతెలియని వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కోదాడ పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై దుర్గాపురం వద్ద గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
స్థానికుల తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లా ఆలమూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై అశోక్, కానిస్టేబుల్ వీరస్వామి పని నిమిత్తం హైదరాబాద్కు కారులో ప్రయాణిస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు మార్గంమధ్యలో కోదాడ సమీపంలోని దుర్గాపురం గ్రామం వద్ద గుర్తుతెలియని వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎస్సై, కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.