నవతెలంగాణ – కంఠేశ్వర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరపాలని సీపీఐ(ఎం) కేంద్ర నాయకులు బి.వెంకట్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నగరంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతులకు రైతు భరోసాను వేయటాన్ని ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఎన్నికల జిమ్మిక్కు కొరకు మాత్రమే చూడటం సరైనది కాదని, ప్రతి సంవత్సరం సకాలంలో రైతులకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు జరపటంలో తాత్సారం చేయటం సరైనది కాదని తెలిపారు.
ప్రధానంగా వ్యవసాయ కార్మికులకు, రైతుబంధును అమలు జరుపుతామని చెప్పి, అందరికీ ఇవ్వకపోవడం, పెన్షన్లను రూ.2000 నుండి రూ.4 వేలకు, వికలాంగులకు రూ.3000 నుండి రూ.6000కు పెంచుతామని ఇచ్చిన హామీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదని అన్నారు. మహిళలకు నెలకు రూ.2500 జీవనభృతి అందిస్తామని ఇచ్చిన హామీ అమలు జరగలేదని ఆయన అన్నారు. అదేవిధంగా బనకచర్ల అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనేది స్పష్టత కల్పించడంతోపాటు, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాన్ని తీసుకొని ముందుకు పోవాలని ఆయన సూచించారు. లేనియెడల ఈ ప్రభుత్వంపైన ఇప్పటికే వ్యతిరేకత పెరుగుతుందని, రాబోయే ఎన్నికల్లో దాని ప్రభావం ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు, కార్యదర్శివర్గ సభ్యులు వెంకట్రాములు పాల్గొన్నారు.