– వృద్ధాప్యంలో ఉన్న తల్ల్లిని గెంటేసిన కొడుకులు
– ఇంటిని సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు
నవతెలంగాణ-అంబర్పేట
వృద్ధాప్యంలో ఉన్న తల్లిని చంటిపిల్లలా చూసుకోవాల్సిన కొడుకులకు అమ్మ బరువైంది. ఆమె సంపాదించిన ఇంట్లోనే దర్జాగా ఉంటూ ఆమెను మాత్రం ఇంటి నుంచి గెంటేశారు. ఈ విషయం ప్రభుత్వ దృష్టికెళ్లడంతో సీరియస్ అయింది. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం ఎమ్మార్వో ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఆ ఇంటిని సీజ్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ మూసారాంబాగ్లో జరిగింది. మూసారాంబాగ్కు చెందిన 90 ఏండ్ల శకుంతలా బాయికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. ఆమె భర్త చాలా ఏండ్ల కిందటే మృతి చెందారు. అప్పటి నుంచి ఆమె తన ఇంట్లో కొడుకులతో కలిసి నివసించేది. వృద్ధాప్యంలో ఉన్న తల్లికి చేదోడువాదోడుగా ఉండాల్సిన కొడుకులు ఆమెను బలవంతంగా ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారు. దిక్కుతోచని పరిస్థితిలో శకుంతలాబాయి సైదాబాద్లో ఉన్న చిన్న కుమార్తె దగ్గర ఉంటోంది. అయితే, తన ఇంటిని తిరిగి స్వాధీనం చేయాలని శకుంతలాబాయి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి 2024 ఫిబ్రవరిలో హైదరాబాద్ ఆర్డీవోను ఆశ్రయించారు. ఆర్డీవో ఆమె కుమారులను కౌన్సెలింగ్కు పిలవగా వారు ఇంటిని తల్లికి అప్పగిస్తామని అంగీకరించారు. కానీ నెలలు గడిచినా ఇల్లు ఖాళీ చేయలేదు. తాజాగా సైదాబాద్ తహసీల్దార్ జయశ్రీ విచారణ జరిపి మూడు రోజుల కిందట బాధితురాలి కుమారులకు ఫైనల్ నోటీస్ జారీ చేశారు. రెండ్రోజుల్లో ఇల్లు ఖాళీ చేయకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. గడువు ముగియడంతో గురువారం సిబ్బందితో తహసీల్దార్ వెళ్లగా.. అప్పటికే వృద్ధురాలి కుమారులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. దాంతో రెవెన్యూ సిబ్బంది ఆ ఇంటిని సీజ్ చేశారు. ఈ ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది. స్థానికులు వృద్ధురాలి కొడుకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మార్వో జయశ్రీ మాట్లాడుతూ.. తల్లిదండ్రులను చూడని పిల్లలకు వారి ఆస్తిపై హక్కు లేదని, ఎవరైనా వారిని మోసం చేస్తే సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకొని వారి ఆస్తిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ జగదీష్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అమ్మ బరువైంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES