Friday, June 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

- Advertisement -

– ఉపాధి కోసం సంక్షేమ పథకాలు : రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ- క్లాక్‌టవర్‌

భవిష్యత్‌ బాగుండాలంటే మాదకద్రవ్యాల జోలికి వెళ్లొద్దని రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విద్యార్థులకు సూచించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో గురువారం జిల్లా పోలీస్‌ యంత్రాంగం, సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన మాదకద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో భాగంగా ఎన్‌జీ కళాశాల నుంచి క్లాక్‌ టవర్‌ వరకు నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం క్లాక్‌ టవర్‌ వద్ద నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. కరోనా తర్వాత డ్రగ్స్‌ వాడకం పెరిగిందని, విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో డ్రగ్స్‌ అన్నదే ఉండొద్దనీ, విద్యార్థుల కోసం స్కిల్‌ యూనివర్సిటీ కట్టిస్తున్నామని, ఇందులో భాగంగా నల్లగొండలో రూ.34 కోట్లతో స్కిల్‌ సెంటర్‌ కట్టిస్తున్నామని అన్నారు. త్వరలోనే సీఎం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభిస్తామని వెల్లడిం చారు. డ్రగ్స్‌ వాడే వారిని తరిమికొట్టాలన్నారు. విద్యార్థులకు లైఫ్‌ టర్నింగ్‌ టైం అని, 20 ఏండ్ల వరకు చదువు, స్పోర్ట్స్‌, యోగాపై దృష్టిపెట్టాలని సూచించారు. విద్యార్థులు, యువత సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలన్నారు. అవసరమైతేనే ఫోన్‌ వాడాలని, చదువుపైనే దృష్టి పెట్టాలని.. చదివి పోటీ పరీక్షలు రాస్తూ ఉద్యోగాలు సాధించాలని చెప్పారు.
ప్రకాశం బజార్‌లో ప్రతీక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పాఠశాల నిర్మిస్తున్నామనీ, డిజిటల్‌ తరగతులతోపాటు అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్సీ కేతావత్‌ శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. ఎస్పీ శరత్చంద్ర పవార్‌ మాట్లాడుతూ.. మిషన్‌ పరివర్తన కింద వారం రోజులపాటు మాదకద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత ఒక్కసారి డ్రగ్స్‌ తీసుకుంటే బానిసలు అవుతారని, డ్రగ్స్‌ గురించి ఏదైనా సమాచారం అందితే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని సూచించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. డ్రగ్స్‌ వాడటం చట్టరీత్యా నేరమని, విద్యార్థులు డ్రగ్స్‌ బారిన పడవద్దని కోరారు. అనంతరం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్‌ కలెక్టర్‌ నారాయణ అమిత్‌, అదనపు ఎస్పీ రమేష్‌, డీఈఓ భిక్షపతి, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, డీడబ్య్లూఓ కృష్ణవేణి, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ జూకూరి రమేశ్‌, మున్సిపల్‌ మాజీ చైర్మెన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -