– జిరాక్స్లు లేకుండానే ఎరువులు
– ఒక్కో రైతుకు నాలుగు బస్తాల యూరియా
– కొన్ని ప్రాంతాల్లో లింకు ఎరువుల విధానం తొలగింపు!
– ప్రభుత్వ ఆగ్రో సంస్థలు, డీలర్లకు ఆదేశాలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రెండు, మూడురోజులుగా ‘నవతెలంగాణ’ దినపత్రికలో యూరియా, డీఏపీ తదితర ఎరువుల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కథనాలు ప్రచురితమవుతు న్నాయి. వీటిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిశారు. యూరియా అంశాన్ని ప్రత్యేకంగా కేంద్రం ముందుంచారు. రాష్ట్రంలో యూరియా నిల్వలు నిండుకోవడంతో ఒక్కో రైతుకు ఎకరానికి రెండు బస్తాలు మాత్రమే.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒక్కటి మాత్రమే ఇస్తుండటంపై ‘నవతెలంగాణ’లో కథనాలు ప్రచురితమయ్యాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో లింకు ఎరువులపైనా ‘ఎరువుల కిరికిరి’ శీర్షికన ఈనెల 7వ తేదీన కథనం ప్రచురితమైంది. తిరిగి 9వ తేదీన ‘రైతుకు నాలుగు బస్తాలే..!’ ఎకరానికి రెండు కట్టలే అది కూడా రైతుల పాస్బుక్ జిరాక్స్ ఆధారంగానే ఇవ్వాలని అధికారులకు ప్రభుత్వం హుకుం జారీ చేయటంపై మరో కథనం ప్రచురితమైంది. యూరియా, డీఏపీలపై వరుసగా ప్రచురితమవుతున్న కథనాలు ప్రభుత్వంలో చలనం తీసుకొచ్చాయి.
పాస్బుక్ జిరాక్స్తో పనిలేదు..
పాస్బుక్ జిరాక్స్తో పనిలేకుండా ఒక్కో రైతుకు నాలుగు బస్తాల చొప్పున యూరియా ఇవ్వాలని బుధవారం ఆదేశాలు జారీ చేశారు. గురువారం నుంచి రిజిస్టర్లో రైతు సంతకం తీసుకుని మాత్రమే మార్క్ఫెడ్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రోస్ సేవా సంస్థలు, మన గ్రోమోర్, హాకా వంటి ప్రభుత్వరంగ సంస్థలు, ప్రయివేటు డీలర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
లింకు ఎరువుల విధానం తొలగింపు..!
లింకు ఎరువుల విధానాన్ని సైతం ప్రభుత్వం తొలగించింది. వినియోగం ఒకింత తక్కువగా ఉండి, నిల్వలు కాస్త ఆశాజనకంగా ఉన్న దక్షిణ తెలంగాణ జిల్లాల్లో లింకు ఎరువుల విధానం వద్దని ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్టు సమాచారం. డీలర్ల నుంచి వస్తున్న ఫిర్యాదులు, వారు ఆందోళనలకు సమాయత్తం అవుతున్న నేపథ్యంలో ఈ విధానాన్ని కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా తొలగించినట్టు తెలిసింది. దాంతో రూ.6 లక్షల విలువైన కాంప్లెక్స్ ఎరువు అమ్మితేనే రూ.లక్ష విలువైన యూరియా సరఫరా చేస్తామనే ఆంక్షలను తాత్కాలికంగా నిలిపివేశారు.
‘నవతెలంగాణ’ కథనానికి స్పందన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES