రాహుల్ గాంధీ పీఎం అయితేనే బీసీలకు మనుగడ
బీసీల బద్ధ శత్రువు నరేంద్ర మోడీ..
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరేందర్ గౌడ్
నవతెలంగాణ – కంఠేశ్వర్
బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా అడుగడుగున కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీల బద్ధ శత్రువు నరేంద్ర మోడీ అని ఆయన ఘాటుగా విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే బీసీలకు మనుగడ సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సామాజిక సేవలో బీసీల పక్షాన ఎవరు ఉన్న వారికి బీసీల మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ సభలలో బీసీల పక్షాన పోరాడింది రాహుల్ గాంధీ మాత్రమేనని ఈ సందర్భంగా నరేందర్ గౌడ్ వెల్లడించారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని కేవలం బీసీ సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని, భవిష్యత్తులో బీసీలు బాగుపడితేనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఆయన అన్నారు.
బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించి, భారత రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని బీసీలందరూ పార్టీలకతీతంగా ఐక్యమత్యంగా పోరాడితేనే 42 శాతం రిజర్వేషన్లు సాధించుకోవచ్చని నరేందర్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, జిల్లా అధ్యక్షులు నారా గౌడ్, ప్రధాన కార్యదర్శి కరిపి గణేష్, బీసీ సంక్షేమ సంఘం ఫోరం చైర్మన్ చిరంజీవులు, ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, యువజన అధ్యక్షులు రాజా గౌడ్, తంబాకు చంద్రకళ, బంటు బలరాం, నర్సింలు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.