Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంకార్పొరేట్లకే లాభం

కార్పొరేట్లకే లాభం

- Advertisement -

– రష్యా నుంచి ఆయిల్‌ దిగుమతుల్లో భారత కార్పొరేట్ల లాభాలు రూ.1.14 లక్షల కోట్లు
– రిలయన్స్‌, నయారా వంటి సంస్థలకు దోచిపెట్టిన మోడీ సర్కార్‌
– ప్రభుత్వ ఆయిల్‌ కంపెనీలపై ఆంక్షలు
– ఒప్పందాల పేరుతో ఇతర దేశాల నుంచి అధిక ధరకు కొనుగోళ్లు
– ప్రజలకు దక్కని ఆర్థిక ప్రయోజనాలు
– రోజువారీగానే పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

భారత్‌, రష్యాలది కాలం పరీక్షించిన స్నేహం. అంతర్జాతీయంగా అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) రష్యాపై ఆంక్షలు విధించినా, ఆ దేశంతో భారత్‌ వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్నది. అందుకు తార్కాణం రష్యా నుంచి భారత్‌ భారీగా దిగుమతి చేసుకుంటున్న క్రూడ్‌ ఆయిల్‌ నిల్వలు. రష్యా ఆదాయంలో అధిక భాగం ముడి చమురు ఎగుమతులపైనే ఆధారపడి ఉంది. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) దేశాలు రష్యా నుంచి క్రూడ్‌ ఆయిల్‌ కొనుగోళ్లు నిలిపివేయగా, భారత్‌, చైనా, టర్కీ వంటి దేశాలు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నాయి.
శ్రీనివాస్‌దాస్‌ మంతటి
అమెరికా, ఈయూ ఆంక్షలు విధించినా, 2022 నుంచి రష్యా క్రూడ్‌ ఆయిల్‌ అమ్మకాలతో ఏకంగా రూ.745 లక్షల కోట్లను (847 బిలియన్‌ డాలర్లు) ఆర్జించింది. సుదీర్ఘ స్నేహబంధంతో అంతర్జాతీయ మార్కెట్‌ కంటే తక్కువ ధరకే ముడి చమురును భారత్‌కు రష్యా విక్రయిస్తోంది. దీంతో భారత్‌కు భారీ ప్రయోజనం చేకూరుతోంది. అయితే తక్కువ ధరకు ముడి చమురు లభించినా, భారత్‌లో ఇంధన ధరలు ఏమాత్రం తగ్గలేదు. గడచిన 39 నెలల కాలవ్యవధిలో రష్యా నుంచి తక్కువ ధరకు దిగుమతి చేసుకున్న ముడిచమురుతో భారత ప్రయివేటు, కార్పొరేట్‌ ఆయిల్‌ కంపెనీలు రూ.1.14 లక్షల కోట్ల లాభాలను ఆర్జించాయి. అదే సమయంలో ప్రభుత్వరంగంలోని భారత ఆయిల్‌ కంపెనీలు రష్యా నుంచి తక్కువ మొత్తంలో దిగుమతులు చేసుకొని, పాత ఒప్పందాల ప్రకారం ఇతర దేశాల నుంచి అధిక ధరకే ముడిచమురు కొనుగోళ్లు జరిపాయి. ఆ మేరకు కేంద్రం ప్రభుత్వ రంగంలోని ఆయిల్‌ కంపెనీలపై షరతులు విధించింది. ప్రయివేటు, కార్పొరేట్‌ సంస్థలకు రష్యా వంటి దేశాల నుంచి తక్కువ ధరకు ఆయిల్‌ కొనుగోళ్లు, ఎక్కువ ధర ఉన్న ఇతర దేశాల నుంచి భారత ప్రభుత్వరంగ ఆయిల్‌ కంపెనీల కొనుగోళ్ల వల్ల బహిరంగమార్కెట్లో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు ఏమాత్రం తగ్గలేదని అంతర్జాతీయ పరిణామాల విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విధానంపై మోడీ సర్కార్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. భారత కార్పొరేట్‌ అయిల్‌ సంస్థలకు ఆయాచిత లబ్ది చేకూర్చారనీ, అదే సమయంలో దేశ ప్రజలకు క్రూడ్‌ ఆయిల్‌ తగ్గింపు ధరల ఫలితాలు అందకుండా చేశారని విశ్లేషిస్తున్నారు.

రష్యా ఆకర్షణీయ డిస్కౌంట్లు
ఇంధన చమురు అవసరాల కోసం భారత్‌ 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. 2022కు పూర్వం రష్యా నుంచి భారత్‌ క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతి వాటా 1 శాతం లోపే. 2022 నుంచి రష్యా దిగుమతులు గణనీయంగా పెరిగాయి. 2025 జూన్‌ నాటికి భారత క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతుల్లో రష్యా వాటా 40 శాతం. 2022-23లో భారత్‌ ఓవరాల్‌ క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతుల (379 మిలియన్‌ బ్యారెల్స్‌) విలువ రూ. 147.03 లక్షల కోట్లు (167.08 బిలియన్‌ డాలర్లు). కానీ భారత్‌ చేసిన చెల్లింపులు రూ.142.74 లక్షల కోట్లు మాత్రమే. రష్యా నుంచి రూ.2.72 లక్షల కోట్ల (31 బిలియన్‌ డాలర్లు) విలువైన క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతి చేసుకున్న భారత్‌, డిస్కౌంట్‌గా రూ.42.82 వేల కోట్ల లబ్ది పొందింది. ఆ ఏడాదిలో అంతర్జాతీయ బహిరంగ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధర ఒక్క బ్యారెల్‌కు రూ.7,075 (8.3.24 డాలర్లు) ఉండగా, రష్యా నుంచి భారత్‌ రూ.5,970కే కొనుగోలు చేసింది. ప్రతి బ్యారెల్‌కు రష్యా రూ.1105 (13 డాలర్ల) భారీ డిస్కౌంట్‌ ఇచ్చింది. 2023-24లో రష్యా క్రూడ్‌ ఆయిల్‌ డిస్కౌంట్‌ 15 నుంచి 10.4 శాతానికి పడిపోయినా, దిగుమతి విలువ (609 మిలియన్‌ బ్యారెల్స్‌)తో పాటు లాభం సైతం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాదిలో భారత్‌ రూ.47.60 వేల కోట్ల (5.41 బిలియన్‌ డాలర్లు) లబ్ది పొందింది. ఓపెన్‌ మార్కెట్‌లో బ్యారెల్‌ ధర రూ.6,493 (76.93 డాలర్లు) ఉండగా.. రష్యా ప్రతి బ్యారెల్‌కు రూ.755.65 (8.89 డాలర్లు) తగ్గించింది. 2024-25లో డిస్కౌంట్‌ 2 శాతమే ఇవ్వటంతో రూ.12.76 వేల కోట్ల లబ్ది మాత్రమే చేకూరింది. 2025-26 జూన్‌ త్రైమాసికానికి డిస్కౌంట్‌ మళ్లీ 6.2 శాతం పెరిగింది. ఫలితంగా లాభాలు సైతం అదే స్థాయిలో పెరిగాయి. మొత్తంగా గడచిన 39 నెలల కాలంలో భారత ప్రయివేటు ఆయిల్‌ కంపెనీలు రష్యా క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతితో రూ.1.14 లక్షల కోట్ల అదనపు లాభం ఆర్జించాయి.

ప్రజలకు దక్కని తగ్గింపు ప్రయోజనం
రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు భారత్‌కు వచ్చినా, ప్రజలకు ఆ ప్రయోజనాలు దక్కడంలేదు. 2022-24 వరకు ఓపెన్‌ మార్కెట్‌తో పోల్చితే భారత కంపెనీలు బ్యారెల్‌కు 10-12 డాలర్లు డిస్కౌంట్‌ పొందాయని గణాంకాలు చెబుతున్నాయి. కానీ రిలయన్స్‌, నయారాలు బ్యారెల్‌కు 10-20 డాలర్ల వరకు డిస్కౌంట్‌ ప్రయోజనం పొందాయని మార్కెట్‌ వర్గాల అంచనా. దేశీయ ఇంధన అవసరాలకు 88 శాతం దిగుమతులపై ఆధారపడిన భారత్‌, రష్యా ఆయిల్‌ను ఇక్కడ అమ్మకుండా, కార్పొరేట్‌ కంపెనీలైన రిలయన్స్‌, నయారాకు అప్పగించి లక్షల కోట్ల రూపాయల లబ్దిని మోడీ సర్కార్‌ చేకూర్చింది. ప్రతిపక్షాలు దీన్నే ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతం ఓపెన్‌ మార్కెట్‌లో బ్యారెల్‌ ముడి చమురు ధర రూ.5,525 (65 డాలర్లు)గా ఉండగా, రష్యా రూ.5,100 (60 డాలర్లు)కే భారత్‌కు విక్రయిస్తోంది. అయినా, దేశీయంగా చమురు ధరల్లో వినియోగదారులకు ఎటువంటి ఉపశ మనం లభించటం లేదు. హైదరాబాద్‌ వంటి మహానగరాల్లో ఇప్పటికీ పెట్రోల్‌ లీటర్‌ ధర దాదాపు రూ.110 వరకు ఉంది. డీజిల్‌ ధర కూడా దాదాపు రూ.100కి చేరువలో ఉంది. ఈ ధరలు తగ్గితే నిత్యవసరాలు సహా అన్ని రకాల వస్తువుల ధరలు తగ్గుతాయి. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం విచారకరం.

ఇక్కడి నుంచే విదేశాలకు ఎగుమతి
రష్యా నుంచి చౌకగా ముడి చమురును కొనుగోలు చేసిన భారత ప్రయివేటు ఆయిల్‌ కంపెనీలు, ఇక్కడ శుద్ధి చేసిన పెట్రోల్‌, డిజీల్‌, ఇతర ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేశాయి. ఇందులో రిలయన్స్‌, నయారా కంపెనీలు ముందున్నాయి. 2022లో రష్యా నుంచి 3 శాతం క్రూడ్‌ ఆయిల్‌ను మాత్రమే కొనుగోలు చేసిన రిలయన్స్‌ సంస్థ ఇప్పుడు (2025) ఏకంగా 50 శాతం దిగుమతి చేసుకుంటోంది. నయారా సంస్థ ఏకంగా 66 శాతం దిగుమతుల్ని రష్యా నుంచే చేసుకుంటోంది.
రష్యా నుంచి చౌకగా దక్కించు కున్న ముడి చమురును శుద్ధి చేసిన ఆయిల్‌ను రిలయన్స్‌, నయారాలు భారత్‌లో అమ్మటం లేదు. జి7 దేశాలు అమెరికా, ఇంగ్లాండ్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ సహా ఉక్రెయిన్‌కు ఎగుమతి చేస్తున్నాయి. శుద్ధి చేసిన చమురును రిలయన్స్‌, నయారాలు యూరోపియన్‌ యూనియన్‌ సహా ఇతర దేశాల్లో బహిరంగ మార్కెట్‌కు అమ్ముకుంటున్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad