– తెరవే ఆధ్వర్యంలో కాళోజి జయంతి
నవతెలంగాణ – కామారెడ్డి
ప్రశ్నించే గొంతుకకు ఆదర్శం కాళోజి అని, ధిక్కార స్వరంగా తెలంగాణ ప్రజల భాషను ప్రపంచ భాషగా చేసిన ధైర్యశాలి కాళోజీ నారాయణ రావు తన రచనల ద్వారా తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచి బలహీనుని ధైర్య కవచంగా నిలబడ్డాడని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ అన్నారు. కామారెడ్డిలో మంగళవారం సెప్టెంబర్ 9 ప్రజా కవి కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా సీనియర్ సిటిజన్స్ ఫోరం తెరవే కామారెడ్డి జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో కాళోజి జయంతిని నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షులు పున్న రాజేశ్వర్ , ప్రధాన కార్యదర్శి రాజన్న తెరవే ప్రతినిధులు, ప్రజా కవి కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తెరవే జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ మాట్లాడుతూ ..ప్రజాకవి కాళోజి నారాయణరావు జీవితం కవులందరికి ఆదర్శప్రాయం అన్నారు. పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అని ఎలుగెత్తి చాటి సమాజంలో చైతన్యం నింపిన ప్రజా కవి కాళోజి నారాయణరావు ఆనాటి సమాజంలో ప్రశ్న ఆయుధంగా చేసుకుని సమాజ సంస్కరణకు పూనుకున్న మహా వ్యక్తి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షులు పున్న రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి రాజన్న, తెరవే ప్రధాన కార్యదర్శి అల్లి మోహన్ రాజ్ , శ్యామ్ కుమార్ మౌర్య , కాసర్ల రామచంద్రం , మంద పీతాంబర్ తిరుపతిరావు, శేషారావు, నాగభూషణం సీనియర్ సిటిజన్స్ ఫోరం ప్రతినిధులు ప్రభాకర్ నారాయణరావు, రాములు, తిరుపతి రెడ్డి, రామ్మోహన్, రాజేశం, సాయిలు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.