Sunday, September 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయందశలవారీగా కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి

దశలవారీగా కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి

- Advertisement -

దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజరుకుమార్‌ శ్రీ వాత్సవ
స్టేషన్‌ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు : ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు


నవతెలంగాణ-కాగజ్‌నగర్‌
కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ను దశల వారీగా అభివృద్ధి చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజరు కుమార్‌ శ్రీ వాత్సవ తెలిపారు. ఈ నెల 18 నుంచి కాగజ్‌నగర్‌లో వందేభారత్‌ రైల్‌కు హల్టింగ్‌ ఇవ్వనున్న నేపథ్యంలో స్టేషన్‌లో సౌకర్యాలను పరిశీలించేందుకు శనివారం ఆయన కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. ప్రత్యేక రైలులో వచ్చిన ఆయన 3వ నెంబర్‌ ప్లాట్‌ఫాంపై దిగగా, స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌బాబు స్వాగతం పలికారు. జీఎం వెంట డీఆర్‌ఎం గోపాలకృష్ణన్‌, చీఫ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ ఎస్‌కే శర్మ, సీనియర్‌ డీఎం రామారావు ఉన్నారు. ఈ సందర్భంగా మూడో నెంబర్‌ ప్లాట్‌ఫాంపై ఉన్న అసౌకర్యాలను ఎమ్మెల్యే జీఎంకు వివరించారు. ఈ ప్లాట్‌ఫాంపై టిక్కెట్‌ కౌంటర్‌ ఏర్పాటు చేయాలని, టాయిలెట్స్‌ సౌకర్యం కల్పించాలని, పూర్తి స్థాయి షెడ్డు ఏర్పాటు చేయాలని జీఎంను ఎమ్మెల్యే కోరారు. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంటుందని, దీన్ని వెడల్పు చేస్తూ నూతనంగా నిర్మించాలని సూచించారు. మూడు ప్లాట్‌ఫాంలపై మూడు లిఫ్ట్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం మొదటి నెంబర్‌ ప్లాట్‌ఫాంను, స్టేషన్‌ బయట పరిసరాలను జీఎం పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చే రోడ్ల పరిస్థితి బాగా లేదని, ఈ రోడ్ల అభివృద్దికి మున్సిపాలిటీ ప్రతిపాదనలు తయారు చేస్తున్నందున దీనికి రైల్వే శాఖ కూడా సహకరించాలని ఎమ్మెల్యే జీఎంను కోరారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. కాగజ్‌నగర్‌ స్టేషన్‌ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను ఎమ్మెల్యే వివరించారని, వాటిని దశల వారీగా అమలు చేస్తామని అన్నారు.

రూ. 20 కోట్లతో అభివృద్ధి పనులు : ఎమ్మెల్యే
కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ అభివృద్ధికి రూ. 20 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్టు ఎమ్మెల్యే హరీశ్‌బాబు తెలిపారు. ఈ నిధులతో స్టేషన్‌ను త్వరితగతిన అభివృద్ధి చేయనున్నామన్నారు. కాగజ్‌నగర్‌లో ఇప్పటికే వందేభారత్‌తో పాటు సంఘమిత్ర, పాటలిపుత్ర, యశ్వంత్‌పూర్‌-గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హల్టింగ్‌ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రాంతం నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తుల సౌకర్యార్థం కేరళ ఎక్స్‌ప్రెస్‌కు హల్టింగ్‌ ఇవ్వాలని జీఎంను కోరినట్టు తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి హౌరా వరకు వయా కాగజ్‌నగర్‌, బల్లార్షాల మీదుగా కొత్త రైలు ప్రతిపాదనను కూడా జీఎం ముందు ఉంచామన్నారు. వచ్చే నెలలో సికింద్రాబాద్‌ నుంచి బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ వరకు వయా గయ, ప్రయాగ్‌రాజ్‌ మీదుగా కొత్తగా అమృత్‌భారత్‌ రైలు ప్రారంభం కానుందని, దీనికి కూడా కాగజ్‌నగర్‌లో హాల్టింగ్‌ ఇచ్చినట్టు తెలిపారు. రైల్వేల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని అన్నారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం, నాయకులు దెబ్బటి శ్రీనివాస్‌, పాటు రైల్‌ యాత్రి సేవా సమితి సభ్యులు అరుణ్‌లోయ, ప్రయాగ్‌ తివారి, పవన్‌ బల్దేవా ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -