నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్థాన్ కు అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ , దానికి చెందిన మజీద్ బ్రిగేడ్ ని విదేశీ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించాలంటూ యూఎన్ భద్రతామండలిలో చైనా,పాక్ చేసిన అభ్యర్థనను అమెరికా అడ్డుకుంది.
పాకిస్థాన్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిం మునీర్ పర్యటన వేళ.. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ , దానికి చెందిన మజీద్ బ్రిగేడ్ను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా గుర్తిస్తూ అమెరికా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బీఎల్ఏని 2019లోనే.. ‘స్పెషల్లీ డెజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ (ఎస్డీజీటీ)’ జాబితాలో చేర్చిన అమెరికా.. మజీద్ బ్రిగేడ్ను కూడా బీఎల్ఏలో భాగంగానే భావిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో గతనెల కీలక ప్రకటన చేశారు.
ఇటీవలే కాలంలో బీఎల్ఏకు చెందిన మజీద్ బ్రిగేడ్ పాక్లోని పలు ప్రాంతాల్లో వరుస దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. పాక్ సైన్యమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు నిర్వహిస్తోంది. 2024లో కరాచీ ఎయిర్పోర్ట్, గ్వాదర్ పోర్ట్ అథారిటీపై బీఎల్ఏ దాడులు చేపట్టింది. ఇక ఈ ఏడాది అంటే 2025లో జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ చేసి దాదాపు 300 మంది ప్యాసింజర్లను బందీలుగా చేసుకుంది. పాక్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి వారిని విడిపించింది. ఈ రైలు హైజాక్ ఘటనలో 31 మంది పౌరులు, పాక్ సైనికులు చనిపోయారు. ఇలా వరుస దాడులతో బలూచ్ ఆర్మీని ఉగ్రసంస్థగా గుర్తించాలని పాక్ కోరుతూ వస్తోంది.