మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతున్నదని ఆ జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ ధీమా వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకరయ్య, పర్ణికారెడ్డి, రాజేశ్ రెడ్డి, గవినొళ్ల మధుసూదన్ రెడ్డి, మేఘా రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అవలంభించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార శైలి, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలకు ఎప్పటిక ప్పుడు ధీటుగా బదులివ్వడం, సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాలను ఎదుర్కొని.. ప్రజలకు నిజాలు తెలియజేయడం వంటి పలు అంశాలు సమావేశంలో చర్చించారు.
ఆయా అంశాలపై ఎమ్మెల్యేలు, నాయకులకు మంత్రి దామోదర రాజనర్సింహ పలు సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు, నాయకులకు టికెట్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. నాయకుల మధ్య సమన్వయ లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరువ చేయాలని కోరారు. సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను బలంగా తిప్పికొడుతూనే, ప్రజలకు వాస్తవాలు తెలిపేలా కార్యకర్తలను సమాయత్తం చేయాలని మంత్రి సూచించారు.
ఉమ్మడి మహబూబ్నగర్లో కాంగ్రెస్దే విజయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES