నవతెలంగాణ – సిద్ధిపేట
బుధవారం రాత్రి ఒంటిగంట సమయంలో సిద్దిపేట పట్టణంలో కురిసిన అకాల వర్షంతో మార్కెట్ యార్డులో ఉన్న మొక్కజొన్న ధాన్యం వేల క్వింటాలు తడిసిపోయింది. కొంతమంది రైతులు ధాన్యం పైన కవర్లు కప్పి జాగ్రత్త పడ్డారు. అకాల వర్షానికి మొక్కజొన్న దాన్యం కొంతమేరకు కొట్టుకుపోయింది. గురువారం తెల్లవారుజామునుండే రైతులు తమ తడిసిన ధాన్యాన్ని ఆరబెట్ట ప్రయత్నం చేశారు. ఓ మహిళ రైతు తమ మక్కాల వద్ద నిలిచిన నీటిని బట్ట సహాయంతో తొలగించడం చూసిన వారిని ఆవేదనకు గురిచేసింది. మరో రైతు తడిసిన మక్కా లను తటలలో ఎత్తి దూరంగా ఆరబోశారు.
నష్టం భరించేది ఎవరు…
సుమారుగా 25 రోజుల నుండి మొక్కజొన్న ధాన్యం మార్కెట్ కు వస్తుంది. ప్రభుత్వం కొనుగోల కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో, కొంతమంది రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు తమ మొక్కజొన్న ధాన్యాన్ని అమ్ముకోగా, మరి కొంతమంది రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే అమ్ముకుంటామని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన తర్వాతనే అక్కడ అమ్ముతామని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి చాలామంది రైతుల మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దయిపోయింది. ఈ నష్టాన్ని ఎవరు భరించాలి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసి, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరుతున్నారు.