చర్చలు జరిపి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి : విద్యార్థి, ఉపాధ్యాయ, గిరిజన సంఘాల డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వేతనాల తగ్గింపును నిరసిస్తూ మినిమం టైంస్కేల్ అమలు చేయాలనీ, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 12 నుంచి గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని డైలీవేజ్ పీఎంహెచ్ వర్కర్లు చేస్తున్న నిరవధిక సమ్మెలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విద్యార్థి, ఉపాధ్యాయ, గిరిజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. సమ్మె చేస్తున్న కార్మికులతో తక్షణమే చర్చలు జరిపి సమస్యను పరిష్కరించి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరింది. శుక్రవారం హైదరాబాద్లోని సీఐటీయూ కార్యాలయంలో డైలీవేజ్, పీఎంహెచ్ వర్కర్ల నిరవధిక సమ్మెకు మద్దతుగా జేఏసీ నాయకులు మాడే పాపారావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారి రవికుమార్, మైదాన ప్రాంత గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ నాయక్, తెలంగాణ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.వెంకటేష్ మాట్లాడారు.
నెల రోజులుగా గిరిజన సంక్షేమ శాఖలో 3,000 మంది డైలీవేజ్, పీఎంహెచ్ వర్కర్లు సమ్మె చేస్తుంటే వారి సమస్యలను పరిష్కరించడంలో, కనీసం వారితో చర్చలు జరపడంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని విమర్శించారు. గిరిజన సంక్షేమ శాఖలో హాస్టల్స్, ఆశ్రమ పాఠశాలలు పీఎంహెచ్ల నిర్వహణలో 35 ఏండ్లుగా డైలీవేజ్, పీఎంహెచ్ వర్కర్ల పాత్ర గణనీయంగా ఉందని వారు తెలిపారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నాలుగో తరగతి ఉద్యోగుల పోస్టులను మంజూరు చేయకుండా, రిటైర్మెంటైన వారి స్థానంలో కొత్తవారిని నియమించకుండా వారితో పని చేయించుకుంటోందని చెప్పారు. సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వాలు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన కారణంగానే కార్మికులు సమ్మెబాట పట్టాల్సి వచ్చిందని అన్నారు.
ఒకే శాఖలో ద్వంద్వ విధానాలా?
ఒకే శాఖలో ఒక దగ్గర టైంస్కేల్ను అమలు చేస్తూ, మరో దగ్గర అమలు చేయకపోవడం సరికాదని నాయకులు అన్నారు. 30 ఏండ్లుగా జిల్లా కలెక్టర్ల గెజిట్ల ప్రకారం పొందుతున్న వేతనాలను 2021లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీఓ 64 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నాగర్ కర్నూల్, ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో వేతనాలను తగ్గించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.26 వేల వేతనాన్ని రూ.11,700కు తగ్గించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అంతేకాక 35 ఏండ్లుగా పని చేస్తున్న వారెవరో తమకు తెలియదనీ, వారి పేర్లు తమ వద్ద లేవని ఆర్థిక శాఖ అధికారులు వితండవాదం చేయడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 2008, 2010లో నాటి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిపి వీరందరినీ రెగ్యులరైజ్ చేయాలనీ, ఆ తీర్మానానికి అనుగుణంగా కొత్త పోస్టులను శాంక్షన్ చేయాలని తీర్మానించారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన అనంతరం వీరిని పర్మినెంట్ చేస్తారని ఆశపడితే జీఓ 16లో డైలీవేజ్ అనే పదం లేదనే పేరుతో వీరు పర్మినెంట్ కాకుండా పోయారని వారు తెలిపారు.
గిరిజన హక్కులకు విఘాతం
గిరిజన సంక్షేమ శాఖ అధికారుల వ్యవహారశైలితో వర్కర్ల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టుగా ఉందని వారు విమర్శించారు. పర్మినెంట్ చేయాలనీ, టైంస్కేల్ ఇవ్వాలని అనేక సంవత్సరాలుగా ఆందోళన చేస్తుంటే అది చేయకపోగా ఉన్న జీతాలను తగ్గించి వారం దరినీ ఔట్సోర్సింగ్లోకి మార్చే ప్రయత్నాలు చేస్తు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా గిరిజన కార్మికులు తమ హక్కులను కోల్పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టైంస్కేల్ అమలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం పడదని వారు తెలిపారు.
సమ్మెతో 1,34,000 మంది గిరిజన విద్యార్థుల ఇబ్బందులు
కార్మికుల సమ్మె ఫలితంగా 1,34,000 మంది గిరిజన విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారని ఆయా సంఘాల నాయకులు తెలిపారు. ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ నిర్వహణలో అనేక ఆటంకాలు వస్తున్నాయని చెప్పారు. చదువుకోవాల్సిన విద్యార్థులు వంటపని చేయాల్సి వస్తుందన్నారు. ఫలితంగా వారి చదువులు దెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో కార్మికులకు మద్దతుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, గిరిజన సంఘాలు ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో డైలీవేజ్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రజనీకాంత్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ.రమ, రాష్ట్ర కమిటీ సభ్యులు వై.సోమన్న తదితరులు పాల్గొన్నారు.