ఎన్నికల వేళ బీజేపీ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ

నవతెలంగాణ-హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికలకు ముందు హర్యానాలోని అధికార బీజేపీ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించుకోవడంతో నాయబ్‌సింగ్ సైనీ సారథ్యంలోని ప్రభుత్వం మైనార్టీలో పడింది. మద్దతు వెనక్కి తీసుకున్న సోంబిర్ సంగ్వాన్, రణ్‌ధీర్ గోలెన్, ధర్మ్‌పాల్ గోండెర్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తమ మద్దతు కాంగ్రెస్‌కేనని ప్రకటించి బీజేపీని ఇరకాటంలో పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఉదయ్‌భానుతో కలిసి రోహ్‌తక్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రైతుల సమస్యల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే తామీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. 90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీలో ప్రస్తుతం 88 మంది మాత్రమే ఉన్నారని, వారిలో బీజేపీ సభ్యులు 40 మంది మాత్రమేనని తెలిపారు. ఇటీవలి వరకు మద్దతిచ్చిన జేజేపీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఉపసంహరించుకున్నారని, ఇప్పుడు తాము కూడా మద్దతును వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణతో నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం మైనార్టీలో పడింది. దీంతో ఆయన రాజీనామా చేయాలని, ముఖ్యమంత్రి పదవిలో ఆయన ఇక ఒక్క నిమిషం కూడా ఉండేందుకు అర్హుడు కాదని పేర్కొన్నారు. వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Spread the love