నవతెలంగాణ న్యూఢిల్లీ: వీధి కుక్కల దాడిలో ప్రముఖ వ్యాపారవేత్త మృతి చెందారు. వాఘ్ బక్రీ టీ (Wagh Bakri Tea) గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ (49) కన్నుమూశారు. మెదడులో రక్తస్రావం వల్ల ఆదివారం ఆయన మరణించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
వివరాల్లోకి వెళితే… గతవారం ఆయన ఇంటికి సమీపంలో కింద పడడంతో తలకు గాయమైతే వెంటనే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించినప్పటికి, మెదడులో రక్తస్రావం అయి ఆయన తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు. ఇంటికి సమీపంలో వీధి కుక్కలు దాడి చేయడంతోనే పరాగ్ దేశాయ్ (Parag Desai) కింద పడ్డట్టు మరి కొందరు ఉటంకిస్తూ కొన్ని జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. దాడి విషయం భద్రతా సిబ్బంది నుంచి కుటుంబ సభ్యులు తెలుసుకొని ఆయన్ని ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నాయి. పరాగ్ దేశాయ్ మృతిపట్ల కాంగ్రెస్ ఎంపీ శక్తిసిన్హా గోహిల్ విచారం వ్యక్తం చేశారు.