నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. ఆగిపోయిన ఎక్స్‌ప్రెస్ రైలు!

నవతెలంగాణ-హైదరాబాద్ : విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్‌ప్రెస్ రైలు అరగంట పాటు నిలిచిపోయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఎటావా సమీపంలో ఉడిమోరి జంక్షన్ రైల్వే స్టేషన్‌ వద్ద మే 3న చోటుచేసుకుంది. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. పట్నా- కోటా మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైలు మే 3న ఉడిమోర్‌ జంక్షన్‌ స్టేషన్‌కు చేరుకుంది. అయితే, అక్కడ రాత్రివేళ విధుల్లో ఉన్న స్టేషన్‌ మాస్టర్‌ నిద్రలోకి జారుకున్నాడు. మరోవైపు, గ్రీన్‌ సిగ్నల్‌ లేకపోవడంతో రైలును లోకో పైలట్‌ అక్కడే ఆపేశాడు. స్టేషన్ మాస్టర్‌ను మేల్కొలిపేందుకు అనేక సార్లు హారన్ కొట్టినట్టు తెలుస్తోంది. అప్పటికే దాదాపు అరగంటపాటు బండి నిలిచిపోవడంతో లోపలి ఉన్న ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వే అధికారులు.. అతడి నుంచి వివరణ కోరారు. అతడి ఇచ్చిన సమాధానం ఆధారంగా తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆగ్రా రైల్వే డివిజన్ పీఆర్‌వో ప్రశస్తి శ్రీవాస్తవ వెల్లడించారు. అయితే, స్టేషన్ మాస్టర్ తన తప్పును ఒప్పుకుని, తప్పిదానికి క్షమాపణ చెప్పినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తనతోపాటు విధుల్లో ఉన్న పాయింట్‌మెన్ ట్రాక్ తనిఖీకి వెళ్లడంతో.. తాను స్టేషన్‌లో ఒంటరిగా ఉన్నట్లు అతడు చెప్పినట్టు వెల్లడించాయి. ‘‘డివిజినల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) తేజ్ ప్రకాశ్ అగర్వాల్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు.. సమయపాలనపై దృష్టిసారించారు.. ఆయన తీసుకుంటున్న చర్యలు, ఉద్యోగులను ప్రోత్సహిస్తున్న విధానంతో ఇటీవల సిబ్బందిలో సయమపాలన 90 శాతానికి చేరింది.. ఏది ఏమైనప్పటికీ స్టేషన్ మాస్టర్ విధుల్లో నిర్లక్ష్యం చేయడం వల్ల ఇతరుల శ్రమ, అంకితభావాన్ని నాశనం చేయడమే కాకుండా రైలు కార్యకలాపాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడింది. ’’ అని రైల్వే వర్గాలు తెలిపాయి. ఎటావా స్టేషన్‌కు ముందు ఉండే ఉడిమోరి జంక్షన్ చిన్నదే అయినా చాలా ముఖ్యమైంది. ఆగ్రా, ఝాన్సీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రైళ్లు దీని మీదుగా వెళ్తాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

Spread the love