ఒంటరి మహిళ ఖాతా నుంచి నగదు కాజేసిన గ్రామ వాలంటీరు

నవతెలంగాణ – అమరావతి: ఒంటరి మహిళ బ్యాంకు ఖాతా నుంచి గ్రామ వాలంటీరు రూ.1.70 లక్షలు కాజేసిన ఘటన ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కొట్రా నాగమణి ఇటీవల తన ఖాతాలో రూ.13,500 నగదు జమ చేసి మొత్తం ఎంత నగదు ఉందని బ్యాంకు సిబ్బందిని ఆరా తీశారు. ఇప్పుడు జమ చేసిన మొత్తం మాత్రమే ఉందని చెప్పడంతో ఆమె కంగుతిన్నారు. ఖాతా నుంచి తాను ఎప్పుడూ నగదు తీసుకోలేదని చెప్పడంతో సిబ్బంది బ్యాంకు స్టేట్‌మెంటు పరిశీలించారు. వేలిముద్ర ద్వారా నగదు తీసుకున్నట్లు గుర్తించారు. దీంతో బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ వాలంటీరు పలుమార్లు తన వేలిముద్ర తీసుకుని మోసం చేసి నగదు స్వాహా చేశాడని వాపోయారు.  బాధితురాలి ఫిర్యాదుపై విచారణ ఎస్సై జీజే విష్ణువర్ధన్‌ చేస్తున్నామని తెలిపారు.

Spread the love