నవతెలంగాణ-బంజారాహిల్స్
విద్యుద్ఘాతంతో కరెంట్ స్తంభంపైనే కార్మికుడు ప్రాణం వదిలాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తెనాలి లంక గ్రామానికి చెందిన పెదబాబు(36) భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. పెదబాబు విద్యుత్ శాఖలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శనివారం విధుల్లో భాగంగా బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీలోని ప్రధాన రహదారిలో ఉన్న వెంకటేశ్వర నివాసంలో కరెంటు పోల్ ఎక్కాడు. ఆ సమయంలో కరెంట్ షాక్ తగలడంతో వెంటనే అతన్ని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, అతను అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.