– 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవు తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ప్రవేశపెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను రానున్న లోక్సభ ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఏకమవుతుండటంతో ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. ఈ సమావేశాల్లో యూసీసీతోపాటు మరికొన్ని కీలక బిల్లులను ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, దేశ రాజధాని నగరం ఢిల్లీ ప్రభుత్వ సవరణ ఆర్డినెన్స్లను ప్రవేశపెట్టవచ్చు. యూసీసీపై జులై 3న జరిగిన పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో కాంగ్రెస్, డీఎంకే పార్టీలు.. ఉమ్మడి పౌర స్మృతికి వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరిని ప్రదర్శించాయి. బీజేపీ నేత, పార్లమెంటరీ ప్యానెల్ చైర్మెన్ సుశీల్ కుమార్ మోడీ మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాలు, గిరిజన ప్రాంతాలకు దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. రాజ్యాంగంలోని 6వ షెడ్యూలు, అధికరణ 371 ప్రకారం వీరికి రక్షణ ఉందని తెలిపారు. యూసీసీపై లీగల్ అఫైర్స్ డిపార్ట్మెంట్, లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్, లా కమిషన్ అభిప్రాయాలను ఈ ప్యానెల్ స్వీకరించింది.