అమరావతి, పోలవరం సంపద సృష్టి కేంద్రాలు

రాష్ట్రానికి అమరావతి, పోలవరం సంపద సృష్టి కేంద్రాలని...గత పాలకుల మూర్ఖత్వం వల్లే రెండూ విధ్వంసానికి గురయ్యాయని ఆం– ప్రజా రాజధానిని విధ్వంసం చేశారు
– ఒక మూర్ఖుడితో రాష్ట్రానికి తీరని నష్టం
– రాజధాని పనులపై వైట్‌పేపర్‌
– ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రానికి అమరావతి, పోలవరం సంపద సృష్టి కేంద్రాలని…గత పాలకుల మూర్ఖత్వం వల్లే రెండూ విధ్వంసానికి గురయ్యాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా రాజధాని అమరావతిని అపహాస్యం చేసి విధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తన రెండో పర్యటనలో భాగంగా ఆయన గురువారం అమరావతిలో పర్యటించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన, విధ్వంసాలకు గురైన నిర్మాణాలు, శిథిలాలను పరిశీలించారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చిన ఉండవల్లిలోని ప్రజావేదిక శిథిలాలను తొలుత వీక్షించారు. అక్కడి నుంచి బయలుదేరి ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా నాడు రాజధానికి భూమిపూజ జరిగిన వేదిక వద్ద మోకాళ్లపై ప్రణమిళ్లారు. అక్కడ నుంచి బయలుదేరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మించిన గహాలను చూశారు. తరువాత ఆలిండియా సర్వీసెస్‌ న్యాయమూర్తుల కోసం నిర్మించిన భవన సముదాయాలనూ పరిశీలించారు. అనంతరం మంత్రుల నివాస గహాలు, గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ అధికారుల, నాల్గొ తరగతి ఉద్యోగుల కోసం నిర్మించిన అపార్ట్‌మెంట్లను పరిశీలించారు.
ఏ అంటే అమరావతి….పీ అంటే పోలవరం
‘రాజధాని కోసం భూములిచ్చిన రైతులు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ”అనేక సవాళ్లను, కేసులను అధిగమించి 1,631 రోజులు ఆందోళనలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం మారడంతో అభివద్ధి జరుగుతుందన్న నమ్మకంతో రైతులు ఆందోళనలు విరమించారు. రాజధాని కోసం రైతులు చేసిన పోరాటం…భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఏపీ అనే పదంలో ఏ అంటే అమరావతి…పీ అంటే పోలవరం. అమరావతి ప్రజారాజధాని…తెలుగువారికి చిరునామాగా ఉంటుంది. 5 కోట్ల మంది ప్రజలకు దశ, దిశను నిర్ధేశిస్తుంది. ఉపాధికోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా గర్వంగా పనులు చేసుకోవచ్చు. కానీ రాజధానిని జగన్‌ అతలాకుతలం చేశారు. దక్షిణ భారతదేశంలో ఎక్కువనీళ్లు ఉండే నది గోదావరి. పోలవరం నిర్మాణం జరిగి నదులు అనుసంధానం చేస్తే ప్రతి ఎకరాకు నీళ్లివ్వచ్చు. విభజన అనంతరం రాజధాని కట్టుకోవడానికి ఆర్థిక తోడ్పాటు, పోలవరం పూర్తి చేసుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, అమరావతి రాజధానికి ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చింది.” అని ఆయన అన్నారు.
పోలవరం-అమరావతి వ్యక్తిగత అంశాలు కావు..
‘ప్రజలు కూటమికి ఏకపక్షంగా ఓట్లు వేశారు…రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద విజయం ఎప్పుడూ రాలేదు. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి పనికిరాడని ప్రజలు తీర్పు ఇచ్చి 11 సీట్లకు పరిమితం చేశారు. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, అర్హతలేని వ్యక్తి సీఎం అయితే రాష్ట్రం ఎంత నష్టపోతుందో గత ఐదేండ్లలో చూశాం. పోలవరం, అమరావతి ప్రాజెక్టులు వ్యక్తిగత అంశానికి సంబంధించినవి కాదు… వాటి ద్వారా సంపద సష్టి జరిగి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది….అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు పెరుగుతాయి. పోలవరం పూర్తి చేసి, నదుల అనుసంధానం పూర్తయితే రాయలసీమ రతనాలు సీమ అవుతుంది. గత ప్రభుత్వం పోలవరంను గోదావరిలో కలిపింది. పోలవరానికి శాపంగా మారిన వ్యక్తి వల్ల, ఆయన మూర్ఖత్వం వల్ల ఖర్చు కూడా రెట్టింపైంది.” అని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
త్వరలో శ్వేతపత్రం విడుదల
”రాజధానిలో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి…పైగా ఇష్టానుసారంగా విధ్వంసం చేశారు. పైపులు, ఇసుక దొంగతనం చేయడంతో పాటు రోడ్లను కూడా తవ్వుకుపోయారు. ఒక్క బిల్డింగును కూడా పూర్తి చేయలేదు. రోడ్ల నిర్మాణాలన్నీ సగంలో ఆగిపోయాయి. కొన్ని బిల్డింగ్‌లు 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. ఐఏఎస్‌, ఐపీఎస్‌, జడ్జీల భవనాలు, మంత్రుల భవనాలు, గెజిటెడ్‌ అధికారుల, నాన్‌ గెజిటెడ్‌ అధికారుల భవనాల నిర్మాణాలు ప్రారంభించాం….ఆ పనులన్నీ అర్ధాంతరంగా నిలిపేశారు. శ్వేతపత్రం విడుదల చేసి రాజధాని ప్రస్తుత పరిస్థితిపై ప్రజలకు వివరాలన్నీ తెలుపుతాం. ప్రజల్లో కూడా గత ప్రభుత్వం విధ్వంసంపై చర్చ జరగాలి. ఏం చేయాలనే దానిపై అధ్యయనం చేయాల్సి ఉంది.” అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
గర్వంగా తలెత్తుకు తిరిగే రాజధాని అమరావతి
‘తెలుగుజాతి గర్వంగా, గౌరవంగా తలెత్తుకు తిరిగే రాజధాని అమరావతి. విశాఖను ఆర్థిక రాజధానిగా, కర్నూలును ఆధునిక నగరంగా తయారు చేయాలనుకున్నాం. కేంద్రం 12 విద్యా సంస్థలను ఇచ్చింది. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, అనంతపురంలో సెంట్రల్‌ యూనివర్సిటీ, మంగళగిరిలో ఎయిమ్స్‌, విశాఖలో ఐఐఎం, తాడేపల్లిలో ఎన్‌ఐటీ, ఒంగోలులో ఐఐటీ, విజయనగరంలో గిరిజన యూనివర్సిటీని…ఇలా ప్రాంతాల వారీగా నెలకొల్పాం. కానీ గత ప్రభుత్వం ఏదీ జరగ నివ్వలేదు ..ముందుకు సాగనివ్వలేదు. రాజధానిపై ఇష్టారీతిన బురదజల్లారు. నిత్యం విష ప్రచారం చేశారు… బ్రాండ్‌ దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌ అన్నారు…స్విస్‌ ఛాలెంజ్‌లో మోసం అన్నారు. సింగపూర్‌ కన్సార్టియంపైనా విషం చిమ్మి తరిమేశారు. రాష్ట్రానికి మధ్యలో ఉండేలా ఎక్కడైనా రాజధాని పెట్టండని శివరామకష్ణ కమిటీ నివేదికలో చెప్పింది. దానికి అనుగుణంగానే 12 పార్లమెంట్‌ స్థానాలు ఒకవైపు…మరో 12 పార్లమెంట్‌ స్థానాలు ఇంకోవైపు ఉండేలా చూసి…గుంటూరు సెంట్రల్‌ గా అమరావతిని రాజధానిగా గుర్తించాం.” అని చంద్రబాబు వివరించారు.
మూడు ముక్కలాట
‘మూడు రాజధానులు అని మూడు ముక్కలాట ఆడారు. పదేండ్ల తర్వాత రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దుస్థితికి తీసుకొచ్చారు. రాజధాని నిర్మాణానికి డబ్బులు ఎక్కడివి అని మాట్లాడారు. రైతులు ఇచ్చిన భూములే కాకుండా ప్రభుత్వ భూములు కలుపుకుని 55 వేల ఎకరాలను సేకరించాం. 29 వేల మంది రైతుల్లో ఒక్కరు కూడా కోర్టుకు వెళ్లకుండా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. ఒక ప్రాజెక్టు కట్టాలంటే భూమి ఇవ్వడానికి ఇష్టపడని ఈ రోజుల్లో రాజధాని కోసం ముందుకు వచ్చి రైతుల భూములు ఇచ్చారు. వారిచ్చిన భూములు, ప్రభుత్వ భూముల్లో రోడ్లు, బిల్డింగులు, ఇతర నిర్మాణాలు పోను మిగిలిన భూములు అమ్మితే రాజధానిని నిర్మించుకోవచ్చు. అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అని నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నా. ఇక్కడ వచ్చే ఆదాయమే రాజధాని నిర్మాణానికి సరిపోతుంది. రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు కూడా రాజధాని సంపదతోనే అమలు చేయవచ్చు…కానీ గత పాలకులు నిర్వీర్యం చేశారని చంద్రబాబు విమర్శించారు.
రాజధాని విధ్వంసంపై ప్రజలకు వివరిస్తాం…
”ఐదేండ్లు పట్టించుకోకపోవడంతో బిల్డింగులన్నీ బూజు పట్టాయి. కొన్నింటిని పగలగొట్టారు. రాజధానికి వ్యతిరేకంగా ఏమేం చేయాలో అన్నింటినీ చేశారు. కాపాడుకోవాలనుకున్న రైతులపైనా పోలీసులు ఏకపక్షంగా కేసులు పెట్టారు. నిర్మాణాల కోసం కాంట్రాక్టర్లు తెచ్చిపెట్టిన మెటీరియల్‌ దోచుకెళ్లారు. రాజధానిలో గత ప్రభుత్వం ఎంతటి నష్టం కలిగించిందో ప్రజలకు వివరిస్తాం. బ్రహ్మాండంగా ఉండాల్సిన రాజధానిలో..ఇప్పుడు తుమ్మచెట్లు, పిచ్చిమొక్కలతో కమ్మేసుకుంది. ఇవన్నీ బాగుచేస్తాం.” అని సీఎం చంద్రబాబు అన్నారు.

Spread the love