నవతెలంగాణ ఢిల్లీ: ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సును బలోపేతం చేయడానికి, దేశ వ్యాప్తంగా తన కార్యకలాపాల నెట్వర్క్ను విస్తరించడానికి రూ.2,800 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు అమెజాన్ ఇండియా తెలిపింది. వ్యాపార విస్తరణ, ఏఐ ఆధారిత డిజిటలీకరణ, ఎగుమతుల వృద్ధి, ఉద్యోగ కల్పన వంటి ఇతర చర్యలపై దృష్టి సారిస్తూ, 2030 నాటికి భారత్లో 35 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.26 లక్షల కోట్ల)కు పైగా పెట్టుబడి పెడతామని గతంలో కంపెనీ ప్రకటించిన ప్రణాళికలో భాగంగానే తాజా పెట్టుబడి ఉంది. భారతదేశం అంతటా వినియోగదారులకు నిమిషాలు, గంటలు, రోజుల్లో సేవలు కొనసాగించేందుకు తన ప్రధాన, క్విక్ కామర్స్ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. ప్రాజెక్ట్ ఆశ్రయ్లో మరింత పెట్టుబడితో పాటు ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలను విస్తరిస్తామని.. వైద్య, ప్రమాద బీమాను మెరుగుపరుస్తామని పేర్కొంది. 10,000 మంది ఉద్యోగులకు, 2 లక్షలకు పైగా కమ్యూనిటీ సభ్యులు ప్రభుత్వ సామాజిక భద్రతా ప్రయోజనాలు పొందేందుకు వీలు కల్పిస్తామని అమెజాన్ వెల్లడించింది.
రూ.2,000 కోట్లకు కొనసాగింపుగా..
2025లో కంపెనీ పెట్టిన రూ.2,000 కోట్ల పెట్టుబడికి కొనసాగింపుగా తాజా పెట్టుబడి ఉంది. ఆ పెట్టుబడితో దేశ వ్యాప్తంగా 17 కొత్త ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలు, 6 సార్టేషన్ కేంద్రాలు, 75 లాస్ట్-మైల్ డెలివరీ స్టేషన్లను ప్రారంభించినట్లు వివరించింది. 2025లోనే అమెజాన్ తన క్విక్కామర్స్ సేవ అయిన ‘అమెజాన్ నౌ’ను కూడా ప్రారంభించింది. అప్పటి నుంచి సురక్షితమైన, వేగవంతమైన డెలివరీలను అందించడానికి కీలక నగరాల్లోని 300కు పైగా మైక్రో-ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలకు దీన్ని విస్తరించింది.
‘2013లో అమెజాన్.ఇన్ను ప్రారంభించినప్పటి నుంచి భారత్లో అత్యంత సురక్షితమైన, వేగవంతమైన, విశ్వసనీయమైన కార్యకలాపాల నెట్వర్క్ నిర్మించాం. దేశంలో సేవలు అందించగల ప్రతి పిన్కోడ్లోని వినియోగదారులకు సేవలు అందిస్తున్నాం. ఈ నెట్వర్క్కు మా సిబ్బందే కీలకం. అందుకే మా ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సు విషయంలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడానికి మేము కట్టుబడి ఉన్నామ’ని అమెజాన్ ఇండియా, ఆస్ట్రేలియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ వెల్లడించారు.



