దుండగుల కాల్పుల్లో అమెజాన్‌ మేనేజర్‌ మృతి

నవతెలంగాణ- న్యూఢిల్లీ : మంగళవారం అర్థరాత్రి దుండగులు జరిపిన కాల్పుల్లో అమెజాన్‌ కంపెనీ మేనేజర్‌ హర్‌ప్రీత్‌ గిల్‌ (36) మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మంగళవారం అర్థరాత్రి బైక్‌పై వెళుతున్న హర్‌ప్రీత్‌ గిల్‌, అతని స్నేహితుడు గోవింద్‌ సింఫ్‌ుని దుండగులు అడ్డగించి కాల్పులు జరిపారు. ఈ ఘటన ఢిల్లీలోని సుభాష్‌ విహార్‌ సమీపంలో భజన్‌పురా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఐదుగురు దుండగులు బైక్‌ పైన, స్కూటర్‌పైన వచ్చారని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో హర్‌ప్రీత్‌ గిల్‌ తలకి బుల్లెట్‌ తగలడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. గిల్‌ స్నేహితుడు గోవింద్‌ సింఫ్‌కి కుడి చెవికి బుల్లెట్‌ గాయమైంది. ప్రస్తుతం అతను లోక్‌ నాయక్‌ జై ప్రకాష్‌ హాస్పిటల్‌ (ఎల్‌ఎన్‌జెహెచ్‌)లో చికిత్స పొందుతున్నారు. కాగా, గోవింద్‌ సింఫ్‌ (32) భజన్‌పురా నివాసి. అతను ‘హంగ్రీ మోమోస్‌’ అనే తినుబండార దుకాణం నడుపుతున్నాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న దుండగులు ఎవరనేది తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతంలోని సిసిటివి కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Spread the love