నవతెలంగాణ- శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కొండలు, లోయల గుండా వెళ్లే రహదారుల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. అధికారులు అప్రమత్తమై రోడ్లపై పడిన బండరాళ్లు, మట్టిని తొలగించి రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం జమ్ముకశ్మీర్లోని గవారి గండోహ్ – జమ్ము మార్గంలో ఓ బస్సును కొండ పైనుంచి జారి వచ్చిన బురద ఢీకొట్టింది. దాంతో రోడ్డుపైన వెళ్తున్న బస్సు రోడ్డు పక్కనున్న గోతిలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులో చిక్కుకున్న నలుగురిలో ఇద్దరిని పోలీసులు రక్షించారు. మరో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. జమ్ముకశ్మీర్లోని గండోహ్ జిల్లాలోగల భాంగ్రూ పట్టణం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.