– చాడ వెంకటరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పూర్ణ స్వాతంత్య్రం కోసం మరో పోరాటం చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అశువులు బాసిన త్యాగధనుల ఫలితమే స్వాతంత్య్రమని తెలిపారు. స్వాతంత్య్రానంతరం రంగురంగుల పార్టీలు
సంపూర్ణ స్వాతంత్య్రం కోసం హామీలివ్వడం, మోసగించడంతోనే సరిపోయిందనీ, ఇప్పటికీ అణచివేత పోలేదని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పౌర హక్కులు హరించబడు తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయనీ, సభ్య సమాజం తలదించుకునేలా మణిపూర్ ఘటనలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం అవసరమని ఆనాడే పిలుపునిచ్చిన పార్టీ సీపీఐ అని గుర్తుచేశారు. దాని కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాం గాన్ని, లౌకికవాదాన్ని కాపాడుకునేందుకు పోరాటం సాగాలని కూడా ఈ సందర్బంగా సూచించారు.వేడుకల్లో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ, వీ.ఎస్.బోస్, నాయకులు కె.శ్రీనివాస్ రెడ్డి, బొమ్మగాని ప్రభాకర్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాల్ రాజ్, నాయకులు బి.వెంకటేష్, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు సృజన, ఐప్సో సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్, ప్రజా నాట్య మండలి ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహా, డీహెచ్పీఎస్ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ పాల్గొన్నారు.