తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

నవతెలంగాణ -హైదరాబాద్: దుబాయిలో మంత్రి కే తారక రామారావు పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది. తన పర్యటనలో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు మంత్రి కేతారక రామారావు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టబడితో మంత్రి కేటీఆర్ తన పర్యటన ప్రారంభించారు. అగ్నిమాపక సామాగ్రి తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన యూఏఈ దిగ్గజ సంస్థ NAFFCO కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో 700 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు మంత్రి కే. తారక రామారావు తో జరిగిన సమావేశంలో కంపెనీ సీఈవో ఖాలిద్ అల్ ఖతిబ్ (NAFFCO Khalid Al Khatib, CEO) ప్రతినిధి బృందం సమావేశమైంది. తెలంగాణ రాష్ట్రంలో తమ అగ్నిమాపక సామాగ్రిని తయారుచేయునట్లు సంస్థ తెలిపింది. ఇందులో భాగంగా 700 కోట్లు రూపాయల భారీ పెట్టుబడిని పెడుతున్నట్లు తెలిపింది. తెలంగాణతోపాటు భారతదేశం విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అగ్నిమాపక సామాగ్రి, అగ్నిమాపక సేవల అవసరం రానున్న భవిష్యత్తులో భారీగా పెరుగుతుందని విశ్వాసం తమకుందని Naffco తెలిపింది. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న అగ్నిమాపక సామాగ్రి తయారీ ప్లాంట్ భారతదేశ డిమాండ్ ను సరిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
దీంతోపాటు తెలంగాణలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తో కలిసి అంతర్జాతీయ స్థాయి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న మంత్రి కేటీ రామారావు ప్రతిపాదనకు కంపెనీ అంగీకారం తెలిపింది. ఈ ట్రైనింగ్ అకాడమీ ద్వారా దాదాపు 100పైగా దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ నైపుణ్యాన్ని, అగ్నిమాపక శిక్షణను తెలంగాణ కేంద్రంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సంస్థ సీఈవో మంత్రి కేటీఆర్ కి తెలియజేశారు.

Spread the love