కెన్యాలో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ ..

నవతెలంగాణ హైదరాబాద్: కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో కెన్యా డిఫెన్స్ చీఫ్ ఫ్రాన్సిస్ ఒమోండి ఒగోల్లా సహా మరో తొమ్మిది మంది ఉన్నతాధికారులు మరణించారని అధ్యక్షుడు విలియం రూటో తెలిపారు. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారని చెప్పారు. రాజధాని నైరోబీ నుంచి 400కి.మీ దూరంలో ఉన్న మారుమూల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. ఏప్రిల్ 18 మధ్యాహ్నం 2:20 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు తెలిపారు.ఈ ఘటనపై అధ్యక్షుడు రూటో విచారం వ్యక్తం చేశారు.
ప్రమాదం గురించి తెలియగా అధ్యక్షుడు రూటో జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై ఎయిర్ ఫోర్స్ బృందాన్ని పంపించారు. మూడు రోజుల పాటు సంతాపదినాలను ప్రకటించారు. ఆర్మీ చీఫ్ ఒగోల్లా 1984లో కెన్యా డిఫెన్స్ ఫోర్సెస్‌లో చేరారు. ఒమోండి ఒగోల్లా40 ఏళ్లుగా మిలిటరీలో సేవలు అందిస్తున్నారు. విమానంలో ఉన్న మరో తొమ్మిది మంది సైనిక సిబ్బంది కూడా మరణించారని, ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. జూన్ 2021లో రాజధాని నైరోబీ ఓ హెలికాఫ్టర్‌ కూలిపోవడంతో కనీసం 10 మంది సైనికులు మరణించారు. గత ఏడాది కాలంలో దాదాపు 5 కెన్యా మిలిటరీ హెలికాప్టర్లు కూలిపోయినట్టు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి.

Spread the love