నవతెలంగాణ- హైదరాబాద్: టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన వందో టెస్టుపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా చివరిదైన ఐదో టెస్టు ధర్మశాల వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ అశ్విన్కి వందో టెస్టు. ఈ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రయాణం తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నాడు. గమ్యం కంటే ఎక్కువ అని అన్నాడు. ”వందో టెస్టు నాకే కాదు.. మా కుటుంబానికీ ఎంతో ప్రత్యేకం. నా తల్లిదండ్రులు, భార్య, పిల్లలు కూడా ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రికెట్ నేను ఏం చేశానో నా తండ్రి ఇప్పటికీ 40మందికి సమాధానం చెప్పగలరు” అని చెప్పుకొచ్చాడు. అలాగే 100వ టెస్టు జరిగే ధర్మశాల వేదికపై కూడా స్పందించాడు. 21ఏళ్ల క్రితం ఈ వేదికపై అండర్-19 క్రికెట్ ఆడానని, చాలా చల్లగా ఉండే ప్రదేశమని తెలిపాడు. కుదురుకోవడానికి కొంత సమయం పడుతుందన్నాడు. ఇక 2011లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన అశ్విన్ 13ఏళ్ల కెరీర్ ఎన్నో ఘనతలు సాధించాడు. ఇటీవలే 500 వికెట్ల ఘనత కూడా అందుకున్నాడు. ఇప్పుడు 100వ టెస్టు ఆడుతున్న 14వ భారత ఆటగాడిగా నిలవనున్నాడు.