నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్కు వచ్చే పెట్టుబడులు గుజరాత్కు తరలించుకుపోవాలనేది బీజేపీ కుట్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. అభివృద్ధి జరగాలన్నా.. ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా.. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. ఉత్తర్ప్రదేశ్లో ఉన్న మతకలహాల వల్లే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదన్నారు. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించారు. హైదరాబాద్కు ఓఆర్ఆర్, విమానాశ్రయం, పరిశ్రమలను గత కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని గుర్తు చేసిన రేవంత్.. అవన్నీ వచ్చాకే రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు అమాంతం పెరిగాయన్నారు. ‘‘మత కలహాలు లేవు కాబట్టే హైదరాబాద్ ఖ్యాతి అంతర్జాతీయంగా పెరిగింది. గుజరాత్ కంటే హైదరాబాద్ ఖ్యాతి పెరగడంతో దానిని తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నారు. మతచిచ్చు పెట్టి శాంతిభద్రతలు చెడగొట్టాలని చూస్తున్నారు. బీజేపీ వాళ్ల మాటలు నమ్మి రాష్ట్రాన్ని ఆగం చేసుకోవద్దు. ఎయిర్పోర్టు వరకు మెట్రో తెస్తా. ఆ తర్వాత షాద్నగర్ వరకు విస్తరిస్తా. ముదిరాజ్లను బీసీ-ఏలో చేర్చేందుకు కృషి చేస్తాం. పాలమూరు బిడ్డకు, ఢిల్లీ సుల్తాన్లకు మధ్య జరుగుతున్న పోరు ఇది. షెడ్డుకు పోయిన కారు.. మళ్లీ తిరిగిరాదని చెప్పాను. కారు తుప్పుపట్టిపోయినందువల్లే.. కేసీఆర్ బస్సెక్కి తిరుగుతున్నారు’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.